KTR: కారు సర్వీసుకు వెళ్లింది.. మళ్లీ తిరిగొస్తుంది: కేటీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Published : 25 Feb 2024 15:58 IST

అచ్చంపేట: కాంగ్రెస్‌ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఆదివారం అచ్చంపేటలో జరిగిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ నియోజకవర్గ సన్నాహక భేటీలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌, తెలంగాణపై ప్రేమ ఉన్నవారు గ్రామాల్లో లక్షలాది మంది ఉన్నారు. పదవులు రాలేదని నాయకులకు ఉండొచ్చు కానీ, కార్యకర్తలకు లేదు. వారిని నాయకులు ఏడాదిపాటు కాపాడుకోవాలి. మిగతా నాలుగేళ్లు కార్యకర్తలే నాయకులను కాపాడుతారు. పాలమూరు పథకానికి జాతీయ హోదా ఇస్తామని మోదీ నమ్మబలికారు. 

పదేళ్లయినా జాతీయ హోదా ఇవ్వలేదు. కర్ణాటకలో అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. కృష్ణానదిపై ప్రాజెక్టులను కాంగ్రెస్‌ కేఆర్‌ఎంబీకి అప్పగించింది. ప్రాజెక్టులను దిల్లీ చేతిలో పెట్టారు. వేసవికాలం రాకముందే మంచినీళ్ల సమస్య మొదలైంది. ఎక్కడ కోల్పోతే తిరిగి అక్కడే సాధించుకోవాలి. అచ్చంపేటలో పూర్వ వైభవం సాధించుకోవాలి. కేసీఆర్‌ నాయకత్వంలో 14 ఏళ్లు ఉద్యమం చేశాం. అనంతరం పదేళ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 24 ఏళ్లు వంద కిలోమీటర్ల వేగంతో కారు జోరుగా వెళ్లింది. ఇప్పుడు కారు సర్వీసుకు మాత్రమే వెళ్లింది.. మళ్లీ తిరిగొస్తుంది. బాలరాజుకు భారాస పూర్తి అండగా ఉంది’’ అని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని