KTR: పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌: కేటీఆర్‌

పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Updated : 27 Mar 2024 14:53 IST

హైదరాబాద్‌: పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదన్నారు. అన్నదాతల్లో బాధ మొదలైందని, యువత ఆవేదనతో ఉన్నారని చెప్పారు. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందో తెలియక హైదరాబాద్‌ ప్రజలు ఆలోచనలో పడ్డారని ఎద్దేవా చేశారు.

‘‘డిసెంబర్‌ 9న విడుదల చేస్తామని చెప్పిన రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడం లేదు. కల్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం లేదు. కాంగ్రెస్‌పై ఆటోడ్రైవర్లు కోపంగా ఉన్నారు. కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు దూషిస్తుంటే బాధగా అనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో భారాస గెలుపే.. అరిచేవారికి సమాధానం కావాలి. మల్కాజిగిరిలో తేల్చుకుందామని రేవంత్‌కు సవాల్‌ విసురుతున్నా. ఇద్దరం ఇక్కడి నుంచి పోటీ చేద్దాం.. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. పెద్దపెద్ద డైలాగ్‌లే తప్పా.. రేవంత్‌కు ధైర్యం లేదు. భాజపాలోకి పోవాలన్నది ఆయన ఆలోచన. కొంత మంది కాంగ్రెస్‌, భారాస ఎమ్మెల్యేలతో భాజపాలోకి పోతారు.’’ అని కేటీఆర్‌ అన్నారు.

అంతకుముందు చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని భారాస ముఖ్య నేతలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ‘‘అధికారం, ఆస్తుల కోసమే రంజిత్‌రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌కు వెళ్లారు. హస్తం పార్టీకి ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ తీవ్రమైన అయోమయంలో ఉంది. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవడం అసాధ్యం. చేవెళ్లలో ఏప్రిల్‌ 13న జరిగే సభలో కేసీఆర్‌ పాల్గొంటారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా నిలబడిన వ్యక్తి’’ అని కేటీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని