Komatireddy: ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత భారాసలో ఎవరూ ఉండరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 02 Jun 2024 14:52 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత భారాసలో ఎవరూ ఉండరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారాస అధినేత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు. మంత్రి పదవి రాలేదనే కారణంతోనే అప్పట్లో తెలంగాణ ఉద్యమం చేపట్టారని, అమాయకులను రెచ్చగొట్టారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో భోజనం చేయాలంటే రూ.లక్ష వసూలు చేసేవారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలంతా సోనియాగాంధీకి రుణపడి ఉండాలని చెప్పిన కేసీఆర్‌.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆమె కాళ్లు మొక్కారని గుర్తు చేశారు.

‘‘ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌.. చేపలు, గొర్రెల పంపిణీ పేరిట రూ.వేల కోట్లు తిన్నారు. ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయింది. మేడిగడ్డకు మరమ్మతులు చేసినా గ్యారంటీలేదని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చింది. భారాస చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతుబంధు వేశారు. 70 వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్సీ నిర్వహించలేదు’’ అని కోమటిరెడ్డి విమర్శించారు. పంద్రాగస్టుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని పునరుద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని