PM Modi: మోదీ 3.Oకు ముహూర్తం ఫిక్స్‌.. జూన్‌ 9న ప్రమాణస్వీకారం..!

PM Modi: ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్‌ 9న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Published : 05 Jun 2024 20:30 IST

దిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ (PM Modi) సిద్ధమవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్‌ 9వ తేదీన మోదీ ప్రమాణస్వీకార (Modi Oath Taking Ceremony) కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ఎన్డీయే కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. 

మంగళవారం నాటి ఫలితాల్లో ఎన్డీయే (NDA) కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్‌ చివరిసారిగా భేటీ అయి, ప్రస్తుత లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేసింది. బుధవారం సాయంత్రం ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతల కీలక సమావేశం జరిగింది. ఇందులో కూటమి నేతలు మోదీని ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం భాజపా, ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఎన్డీయే కొత్త ఎంపీలతో కలిసి మోదీ.. రాష్ట్రపతిని కలవనున్నారు. 

హ్యాట్రిక్‌ విజయంతో నెహ్రూ, ఇందిర, వాజ్‌పేయీల సరసన మోదీ

మోదీ రాజీనామా..

కేబినెట్‌ సమావేశం అనంతరం ప్రధాని మోదీ తన మంత్రిమండలితో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖను సమర్పించారు. ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవుల్లో కొనసాగాలని మోదీ టీమ్‌ను కోరారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో  (Lok Sabha Election Results) భాజపా 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్‌ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ మార్కు (272)ను ఎన్డీయే దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు