Pashupati Paras: ఎన్డీయేకే మద్దతు.. మోదీయే మా నేత: మాజీ కేంద్రమంత్రి

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకే మద్దతు కొనసాగిస్తామని ఆర్‌ఎల్జేపీ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి పశుపతి కుమార్‌ పారస్‌ ప్రకటించారు.

Updated : 30 Mar 2024 23:48 IST

పట్నా: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బిహార్‌లో అధికార ఎన్డీయే (NDA)కే మద్దతు కొనసాగిస్తామని రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ (RLJP) అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి పశుపతి కుమార్‌ పారస్‌ (Pashupati Paras) ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య ఎంపీ సీట్ల సర్దుబాటులో ఆర్‌ఎల్‌జేపీకి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఇటీవల తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

‘‘భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో మా పార్టీ విడదీయరాని భాగం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే మా నాయకుడు. ఆయన నిర్ణయమే మాకు శిరోధార్యం. రానున్న ఎన్నికల్లో 400కుపైగా సీట్లతో మా కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడంలో మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది’’ అని ‘ఎక్స్‌’ వేదికగా పారస్‌ పేర్కొన్నారు.

అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్‌ రాజీనామా

ఎన్డీయే మిత్రపక్షమైన లోక్‌ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దళిత నేతగా పేరొందిన రామ్‌విలాస్‌ పాసవాన్‌ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్‌, సోదరుడు పారస్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే 2021లో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. చిరాగ్‌ ఎన్డీయే నుంచి బయటకు రాగా.. అందులోనే ఉన్న పశుపతి కుమార్‌కు కేంద్రమంత్రి పదవి దక్కింది. అయితే, ఇటీవల చిరాగ్‌ మళ్లీ కూటమిలో చేరగా.. ఆయన ఆధ్వర్యంలోని ఎల్జేపీ (రాంవిలాస్‌) పార్టీకి ఐదు సీట్లు కేటాయించారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన సిట్టింగ్‌ స్థానం హాజీపుర్‌ నుంచి పోటీ చేయాలని భావించిన పారస్‌కు ఇప్పుడు సీట్లే దక్కలేదు. ఆయన స్థానం నుంచి చిరాగ్‌ బరిలో దిగారు. ఈ పరిణామాలతో పశుపతి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అధికార కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చాయి. అయితే.. తగిన గౌరవం ఇస్తామని భాజపా నేతలు ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎన్డీయేకు మద్దతు పలుకుతూ.. తన తదుపరి కార్యాచరణపై పారస్‌ స్పష్టత ఇచ్చినట్లయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని