Lok Sabha Elections: సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్‌ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి

Lok Sabha Elections: ఐదో విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో రాజ్‌నాథ్‌ సింగ్, పీయూష్‌ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్‌గాంధీ వంటి ప్రముఖులు ఉన్నారు.

Published : 20 May 2024 07:27 IST

Lok Sabha Elections | ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో మొత్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఐదో దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్‌ పూర్తవుతుంది.

బరిలోని ప్రముఖులు..

ఈ విడతలో (Lok Sabha Elections) మొత్తం 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో రాజ్‌నాథ్‌ సింగ్, పీయూష్‌ గోయల్, స్మృతి ఇరానీ తదితర కేంద్ర మంత్రులతోపాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు.

ఈ రాష్ట్రాల్లో..

అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 7,  బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 1, లద్దాఖ్‌లో 1 స్థానానికి పోలింగ్‌ జరుగుతోంది. ఒడిశాలో ఐదు లోక్‌సభ స్థానాలతోపాటు 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు ప్రతి విడతలోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికితోడు ఐదో విడతలోని 57% పోలింగ్‌ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించడంతో.. ముందుజాగ్రత్త చర్యగా 60 వేలకుపైగా కేంద్ర బలగాలతోపాటు 29,172 మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు.

అందరి దృష్టి ఆ రెండు స్థానాలపై..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేఠీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండూ కాంగ్రెస్‌కు కంచుకోటల్లాంటి సీట్లు. అయితే అయిదేళ్ల కిందట అమేఠీలో రాహుల్‌గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం రాయ్‌బరేలీలో రాహుల్‌ పోటీ చేస్తున్నారు. అమేఠీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరీలాల్‌ శర్మను కాంగ్రెస్‌ బరిలో దించింది. లఖ్‌నవూలో హ్యాట్రిక్‌పై రాజ్‌నాథ్‌ సింగ్‌ గురిపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని