Modi: తన కంచుకోటనే కాపాడుకోలేకపోయారు: రాహుల్‌పై మోదీ ఎద్దేవా

నేడు కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ(Modi).. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే, దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. 

Published : 15 Apr 2024 16:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) సోమవారం కేరళ (Kerala)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై విమర్శలు చేశారు. ఆయన తన కుటుంబానికి కంచుకోటను రక్షించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్‌ వరుసగా 15 ఏళ్లపాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నాయకురాలు స్మృతిఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో వయనాడ్‌ బరిలో నిలిచి విజయం సాధించారు.

ప్రస్తుతం త్రిస్సూర్‌ ప్రచారంలో ఉన్న మోదీ మాట్లాడుతూ.. ‘‘రాహుల్ కేరళ నుంచి ఓట్లు అడుగుతున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన తన గళం వినిపించరు’’ అని దుయ్యబట్టారు. అలాగే కరువన్నూర్ కోపరేటివ్ బ్యాంక్‌ స్కామ్‌ గురించి లేవనెత్తి సీపీఎంపై విమర్శలు చేశారు. పేదల సొమ్మును దోచుకుందని దుయ్యబట్టారు. అలాగే పాలక్కాడ్‌లో మాట్లాడుతూ..‘‘పశ్చిమ్‌బెంగాల్‌ నుంచి కేరళ వరకు వామపక్ష ప్రభుత్వాలకు ఒక లక్షణం ఉంది. లెప్ట్‌ ప్రభుత్వాలు పాలించినచోట ఏమీ మిగల్లేదు. ఏదీ సరిగా జరగలేదు’’ అని వ్యాఖ్యానించిన ఆయన ‘నథింగ్ లెఫ్ట్‌ అండ్‌ నథింగ్ రైట్‌’ అనే పదజాలాన్ని ప్రయోగించారు.

మోదీకి అప్పుడే విదేశీ ఆహ్వానాలు: రాజ్‌నాథ్‌

ఈ ఎన్నికల తర్వాత పార్లమెంట్‌లో కేరళ గళం పెరుగుతుందన్నారు. భారత్‌ ప్రతిష్ఠను కాంగ్రెస్‌ బలహీనపరిస్తే.. తాము దేశాన్ని బలోపేతం చేశామని తెలిపారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా ట్రైలర్ అని, కేరళ, దేశం కోసం చేయాల్సింది ఎంతో ఉందని తెలిపారు. ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు, ఉత్తర, దక్షిణ భారతదేశంలో బుల్లెట్‌ ట్రైన్ల కోసం సర్వే ప్రారంభమవుతుందని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని