Prashant Kishor: మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత ప్రశాంత్‌ కిశోర్‌ స్పందన

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తొలిసారి స్పందించారు. 

Updated : 02 Jun 2024 15:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొందరు చేపట్టే అనవసర రాజకీయ చర్చలు వింటూ సమయం వృథా చేసుకోవద్దని ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) ప్రజలకు సలహా ఇచ్చారు. నిన్న పలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తన అంచనాలకు అనుకూలంగా వెలువడిన తర్వాత ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తొలిసారి స్పందించారు. ‘‘ఈ సారి  ఎప్పుడైనా ఎన్నికలు.. రాజకీయాలపై చర్చలు జరుగుతుంటే బూటకపు జర్నలిస్టులు, నోరేసుకుపడే రాజకీయ నాయకులు, స్వయం ప్రకటిత సోషల్‌ మీడియా మేధావుల పనికిమాలిన విశ్లేషణలపై మీ సమయం వృథా చేసుకోవద్దు’’ అని ప్రజలకు పీకే సలహా ఇచ్చారు. 

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 300కు పైగా సీట్లు సాధిస్తుందని ప్రశాంత్‌ కిశోర్ మొదటి నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కూడా ఆయన చేసిన ఎక్స్‌ పోస్టులో తన అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండదనే ఉద్దేశం కనిపించింది. కానీ, కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో.. ప్రశాంత్‌ కిశోర్‌ గతంలో చేసిన అంచనాలు తలకిందులైన విషయాన్ని ప్రస్తావించారు. ఆ క్రమంలోనే జర్నలిస్టుకు, కిశోర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యర్థులను సవాలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. నిరాశలో కూరుకుపోయిన వారికి ఒక సలహా ఇచ్చారు. ‘‘జూన్‌ 4న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి’’ అని ఎద్దేవా చేశారు. 2021లో వెస్ట్‌ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుందని ఆయన వేసిన అంచనా నిజమైందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా వైకాపా ప్రభుత్వానికి ఎన్నికల ఫలితాలు షాక్‌ ఇస్తాయని ఆయన జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎన్‌డీఏ కూటమి భారీగా సీట్లను సాధిస్తుందని పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా తూర్పు, దక్షిణ భారతంలోనూ భాజపా సీట్లు, ఓట్లశాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. భాజపాను అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని.. కానీ, బద్ధకం, తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదన్నుకుందని విశ్లేషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని