Loksabha polls: బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్‌.. కారణమిదే..

ప్రయాగ్‌రాజ్‌లో ఓ బహిరంగ సభలో ప్రసంగించకుండానే రాహుల్‌ గాంధీ మధ్యలోనే వెనుదిరిగారు.

Published : 19 May 2024 21:17 IST

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన  బహిరంగ సభలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి రాహుల్‌ బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే.. ఆ సభలో ప్రసంగించకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు. సభలో తొక్కిసలాట లాంటి పరిస్థితులు చోటుచేసుకోవడమే దీనికి కారణం.

ఫూల్‌పుర్‌ నియోజకవర్గ పరిధిలోని పాడిలా గ్రామంలో బహిరంగ సభకు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav) హాజరయ్యారు. వీరిని చూడడానికి కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తలు ఒక్కసారిగా వేదికవైపు దూసుకురావడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు కూడా వారిని నియంత్రించకలేకపోయారు. అఖిలేష్, రాహుల్ విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా వారిద్దరూ ప్రసంగించకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం అలహాబాద్ నియోజకవర్గంలోని ముంగారి గ్రామంలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని