Sajjala: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోవడంతో పలువురు ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. జగన్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డితో సహా 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా సీఎస్‌ జవహర్‌రెడ్డికి లేఖలు పంపారు. 

Updated : 05 Jun 2024 20:05 IST

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోవడంతో పలువురు ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. జగన్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డితో సహా 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా సీఎస్‌ జవహర్‌రెడ్డికి లేఖలు పంపారు. 

జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలు సమర్పించారు. ఫలితాలు వెలువడిన వెంటనే తితిదే ఛైర్మన్‌ పదవికి భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామా చేశారు. తనను రిలీవ్ చేయాలని సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి  ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు పదవీ కాలాన్ని పొడిగించాలని ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు పంపించడం గమనార్హం.

కడప ఆర్కిటెక్చర్ వర్సిటీ రిజిస్ట్రార్‌ పదవి నుంచి రిలీవ్ చేయాలని జగన్ బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తనను తిరిగి మాతృసంస్థకు పంపాలని వీసీని కోరారు. గతంలో ఈయన కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో బయో టెక్నాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. డిప్యూటేషన్‌పై ఆర్కిటెక్చర్‌ వర్సిటీలో చోటు సంపాదించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ పోస్టులోకి వెళ్లారని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అయితే డిప్యూటేషన్‌పై ఉన్న వారిని తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని