Sumalatha: భాజపాలో చేరికపై సుమలత ప్రకటన.. కుమారస్వామికి మద్దతు

తాను భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు మాండ్య ఎంపీ సుమలత ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ సీటు నుంచి బరిలో ఉన్న జేడీఎస్‌ నేత కుమారస్వామికి మద్దతు ప్రకటించారు.

Updated : 03 Apr 2024 20:05 IST

మాండ్య:  లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Election) వేళ మాండ్య స్వతంత్ర ఎంపీ, సీనియర్‌ నటి సుమలత (Sumalatha) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో వున్న జేడీఎస్‌ నేత కుమారస్వామికి మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను మాండ్యను వీడను. నేను మీ కోసం పనిచేయడం రాబోయే రోజుల్లో చూస్తారు. భాజపాలో చేరాలని నేను నిర్ణయించుకున్నా’’ అని తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో సుమలత వెల్లడించారు. 

‘‘నేను ఒక స్వతంత్ర ఎంపీ అయినా కేంద్ర ప్రభుత్వం మాండ్యకు రూ.4వేల కోట్లు గ్రాంటు ఇచ్చింది. ఈ నియోజకవర్గం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకొనేముందు భాజపా నేతలు ఎప్పుడూ నన్ను విశ్వాసంలోకి తీసుకుంటున్నారు. భాజపాకు మీ అవసరం ఉంది. ఈ పార్టీని వదులుకోవద్దు అని ప్రధాని మోదీ కోరినప్పుడు.. ఆయన మాటను నేను గౌరవించాలి కదా. నన్ను వేరే జిల్లా నుంచి పోటీ చేయాలని భాజపా ఆఫర్‌ ఇచ్చినా తిరస్కరించా. మాండ్య జిల్లాకు కోడలిగా ఇక్కడే ఉంటాను. నా మద్దతుదారులు కొందరు నన్ను కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. అయితే, ఆ పార్టీకి సుమలత అవసరం ఇప్పుడు లేదు.. ఇకపైనా రాదంటూ ఒక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అన్నాక.. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిగా ఆ పార్టీలోకి వెళ్లాలని ఎలా అనుకుంటాం’’ అని సుమలత తెలిపారు.

అలాగే, గత ఐదేళ్లలో మాండ్యకు చేసిన పనుల్ని ఈ సందర్భంగా సుమలత వివరించారు. లోక్‌సభ ఎన్నికలంటే చిన్న పిల్లల ఆట కాదని.. అందులోనూ ఒక మహిళ స్వతంత్ర ఎంపీగా గెలుపొందడమంటే మరింత సవాల్‌తో కూడుకున్నదన్నారు. అయినా గానీ, మాండ్య ప్రజలు గత ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఎంపీగా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత భాజపా మద్దతుతో.. కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను ఓడించిన విషయం తెలిసిందే. గతేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె భాజపాకే మద్దతు ప్రకటించారు. ఆ సమయంలోనే ఆమె కమలదళంలో చేరబోతున్నారంటూ పెద్దఎత్తున ఊహాగానాలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమె భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్‌లో మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ ఎన్డీయే కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 25 చోట్ల భాజపా.. మాండ్యతో పాటు మూడు స్థానాల్లో జేడీఎస్‌ బరిలో దిగుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు