Ganta: జగన్‌.. మీది గురివింద గింజ చందం: గంటా శ్రీనివాసరావు

సీఎం జగన్‌  విజయనగరం జిల్లా కురుపాం పర్యటనలో ప్రతిపక్ష నాయకులపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు.

Published : 29 Jun 2023 01:29 IST

విశాఖ: సీఎం జగన్‌  విజయనగరం జిల్లా కురుపాం పర్యటనలో ప్రతిపక్ష నాయకులపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. గతంలో జగన్‌.. ఆనాటి ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

సీఎం జగన్‌ కురుపాం పర్యటనలో ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘వారి నోటికి అడ్డూ అదుపు లేదు. ఆ రౌడీల మాదిరిగా మేము తొడ కొట్టలేం. బూతులు తిట్టలేం’’ అని వ్యాఖ్యానించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ‘‘ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి.. రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చి చంపాలి, చెప్పులతో కొట్టాలి, చీపుర్లు చూపించాలంటూ స్వరం పెంచి మాట్లాడిన మాటలు మర్చిపోయారా? సీఎం హోదాలో ఉన్న మీరు  మీ స్థాయి మర్చిపోయి బహిరంగ సభలో నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి మర్చిపోయారా? ఈరోజు మీ  మాటలు వింటుంటే గురివింద గింజ సామెతను గుర్తుకొస్తోంది జగన్‌మోహన్‌ రెడ్డి గారు..!’’ అని గంటా శ్రీనివాసరావు ట్వీట్‌లో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని