LS Polls: బెంగాల్‌ను చొరబాటుదారులకు లీజుకు ఇచ్చారు.. టీఎంసీపై ప్రధాని మోదీ ధ్వజం

పశ్చిమ బెంగాల్‌ను అధికార టీఎంసీ.. చొరబాటుదారులు, గూండాలకు లీజుకు ఇచ్చిందని ప్రధాని మోదీ ఆరోపించారు.

Published : 16 Apr 2024 17:25 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని టీఎంసీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ చొరబాటుదారులు, గూండాలకు లీజుకు ఇచ్చిందని ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అకృత్యాలను చూసి దేశం మొత్తం నివ్వెరపోయిందన్నారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో బెంగాల్‌లోని బాలుర్‌ఘాట్‌లో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు.

‘‘దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారికి టీఎంసీ మద్దతు ఇస్తుంది. కానీ, శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ‘సీఏఏ’ను మాత్రం వ్యతిరేకిస్తోంది. స్థానికంగా అవినీతి, నేరాలు పెచ్చుమీరుతున్నాయి. వాస్తవాలు వెలికితీసేందుకు యత్నిస్తోన్న కేంద్ర సంస్థలపైనా దాడులు జరుగుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే టీఎంసీ ఈ రాష్ట్రాన్ని చొరబాటుదారులకు, గూండాలకు అప్పగించినట్లు కనిపిస్తోంది’’ అని ప్రధాని మోదీ ఆరోపించారు.

భాజపా ‘బెంగాల్‌ వ్యతిరేక పార్టీ’: దీదీ

టీఎంసీని అవినీతి పార్టీగా పేర్కొంటున్న ప్రధాని మోదీ.. ముందుగా తాను అద్దంలో చూసుకోవాలని, భాజపా మొత్తం బందిపోట్లతో నిండిపోయిందని మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ‘‘అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు భాజపా ప్రభుత్వం 300 కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపింది. కానీ, ఇంతవరకు ఏం కనుగొనలేదు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఉపాధి నిధులు ఏమయ్యాయో బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

‘మోదీ.. సంపన్నులకు ఓ సాధనం’.. రాహుల్‌ విమర్శలు

భాజపాను ‘బెంగాల్‌ వ్యతిరేక పార్టీ’గా పేర్కొన్న దీదీ.. ‘ఎన్‌ఆర్‌సీ’ ముసుగులో గిరిజనులు, దళితులు, ఓబీసీలను ఇక్కడినుంచి తరిమికొట్టాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అనుమతించబోమని తేల్చి చెప్పారు. తన కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు భాజపా నేతలు ‘దొంగ దొంగ’ అని అరిచారని ఆమె ఆరోపించారు. ‘‘నేను ఎంపీ పింఛన్‌ డ్రా చేయడం లేదు. జీతం కూడా తీసుకోను. సొంత కారులో ప్రయాణిస్తాను. సాధారణ వస్త్రాలే ధరిస్తాను. సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాను. చాయ్‌ ఖర్చులూ నేనే చెల్లిస్తాను’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని