Hyderabad: హైదరాబాద్‌కు దిల్లీ సీఎం.. కేసీఆర్‌తో భేటీ కానున్న కేజ్రీవాల్

కేంద్రం ఆర్డినెన్స్‌పై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఈమేరకు శనివారం ఆయన హైదరాబాద్‌ రానున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated : 26 May 2023 17:05 IST

హైదరాబాద్‌: కేంద్రం ఆర్డినెన్స్‌పై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలువురు విపక్ష నేతలను ఆయన కలిశారు. 

దేశ రాజధాని పరిధి దిల్లీలో గ్రూప్‌ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను కేంద్ర ప్రభుత్వం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. సంబంధిత ఉద్యోగుల విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ రాజధాని సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి దిల్లీ ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.   

దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అమలు పరచాల్సిందేనని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు మంత్రులు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్‌ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కేజ్రీవాల్‌ ట్వీట్‌ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్‌ పలువురు నేతలను కలిశారు. ఈ క్రమంలోనే శనివారం సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు.

నీతి ఆయోగ్‌ భేటీకి కేజ్రీవాల్‌ డుమ్మా..

శనివారం జరిగే నీతి ఆయోగ్‌ భేటీని బహిష్కరిస్తున్నట్లు కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ప్రధాన మంత్రే సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండటం లేదని పేర్కొన్నారు. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రజలు అడుగుతున్నారన్నారు. సహకార సమాఖ్య అనేది అపహాస్యం అవుతున్న వేళ.. నీతి ఆయోగ్‌ భేటీ వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. కాగా.. ఇప్పటికే నీతి ఆయోగ్‌ భేటీని సీఎంలు మమత బెనర్జీ, భగవంత్‌ మాన్‌ బహిష్కరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని