Karnataka: 135 మంది ఎమ్మెల్యేల మద్దతు నాకే..: డీకే శివకుమార్‌

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, తన అధ్యక్షతన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలుచుకుందని, వారందరి మద్దతు తనకే ఉందని శివకుమార్‌ వ్యాఖ్యానించారు.

Updated : 15 May 2023 19:55 IST

బెంగళూరు: కర్ణాటక (Karnatka) తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపికవుతారనేది ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. ఈ పదవి విషయంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar)ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ విషయమై చర్చలకు అధిష్ఠానం నుంచి పిలుపు రాగా.. సిద్ధరామయ్య ఇప్పటికే దిల్లీ (Delhi)కి చేరుకున్నారు. ఈ క్రమంలోనే డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అధ్యక్షతన కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) పార్టీ 135 సీట్లు గెలుచుకుందని, వారందరి మద్దతు తనకే ఉందన్నారు.

‘సీఎం ఎంపిక అంశాన్ని అధిష్ఠానానికి వదిలేస్తామని సీఎల్పీ సమావేశంలో తీర్మానం చేశాం. ఆ తర్వాత కొందరు వారి వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. ఇతరుల సంఖ్యాబలం గురించి మాట్లాడను. కానీ, నా సంఖ్యాబలం 135. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడి 135 సీట్లు సాధించింది. క్షేత్రస్థాయి నుంచి మరింత సహకారం వచ్చి ఉంటే సీట్లు పెరిగేవి. కానీ, ఫలితాల విషయంలో మేం సంతోషంగా ఉన్నాం’ అని శివకుమార్‌ మాట్లాడారు. ‘నేను ఒంటరి మనిషిని. ధైర్యం కలిగిన ఒక్క వ్యక్తి.. మెజారిటీ సాధించగలడని నమ్ముతా. నిరూపించాను కూడా. 2019లో అనేకమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఇటీవల బెంగళూరులో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పరిశీలకులుగా వ్యవహరించిన సుశీల్‌ కుమార్‌ షిండే, జితేంద్ర సింగ్‌, దీపక్‌ బబారియాలు.. దిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటికి చేరుకున్నారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు వ్యక్తపరిచిన అభిప్రాయాలతో కూడిన నివేదికను ఈ సందర్భంగా ఖర్గేకు సమర్పించినట్లు సమాచారం. అయితే, అంతకుముందు తాను దిల్లీ వెళతానని పేర్కొన్న డీకే.. గంటల వ్యవధిలో మాట మార్చారు. సీఎం అభ్యర్థి నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికే వదిలేశానని, అనారోగ్య కారణాల వల్ల తాను దిల్లీ వెళ్లట్లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని