‘ఇండియా’ కూటమి గెలిస్తే CAA, NRC రద్దు చేస్తాం: మమత

ప్రధాని నరేంద్ర మోదీని మూడోసారి గెలిపిస్తే.. దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

Published : 17 Apr 2024 16:55 IST

సిల్చార్‌:  యావత్‌ దేశాన్ని భాజపా ఓ నిర్బంధ శిబిరంగా మార్చేసిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. విపక్ష కూటమి ‘ఇండియా’ కేంద్రంలో అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె అస్సాంలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా దీదీ మాట్లాడుతూ.. మూడోసారి గనక ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఎన్నికలూ ఉండవని వ్యాఖ్యానించారు. దేశాన్ని వాళ్లు నిర్బంధ శిబిరంలా మార్చేశారని.. ఇంత ప్రమాదకరమైన ఎన్నికలను తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. 

ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్‌

అన్ని మతాలనూ తమ పార్టీ ప్రేమిస్తుందన్న దీదీ.. మతాల ప్రాతిపదికన విభజనను మాత్రం తాము కోరుకోవడం లేదన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (NRC), పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఉమ్మడి పౌరస్మృతి ఉండవన్నారు. వివక్షతో ఉన్న అన్ని చట్టాలను రద్దు చేస్తామని స్పష్టంచేశారు. అస్సాంలో తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన నలుగురు అభ్యర్థులను గెలిపించాలని ఈసందర్భంగా అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు.  2026లో జరగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 126 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన మమత.. ‘ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే.. ఫైనల్‌ ఇంకా రాలేదు.. నేను మళ్లీ వస్తా’ అని వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని