CSK: అతడే సీఎస్‌కే భవిష్యత్తు కెప్టెన్‌: అంబటి రాయుడు

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో (IPL) అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK). ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, అతడి తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

Published : 24 Jul 2023 14:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐదుసార్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ను (CSK) ఛాంపియన్‌గా నిలిపిన ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడటంపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఆటగాడిగా మైదానంలోకి దిగుతాడా..? సీఎస్‌కేకు మెంటార్‌గా వ్యవహరిస్తాడా.? అనేది తేలలేదు. ఒకవేళ ధోనీ తర్వాత కెప్టెన్‌గా సీఎస్‌కేను ఎవరు నడిపిస్తారనే ప్రశ్నకు సమాధానం రవీంద్ర జడేజా అని రావడం సహజం. ఎందుకంటే సీఎస్‌కేలో సీనియర్‌ ఆటగాడు అతడే. అదేవిధంగా గత వేలంలో భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన బెన్‌ స్టోక్స్‌ పేరూ వస్తోంది. కానీ, మొన్నటి వరకు సీఎస్‌కే జట్టు తరఫున ఆడి క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు మాత్రం భవిష్యత్తు సారథిగా ఎవరు ఉంటారనే దానిపై తన విశ్లేషణ వెల్లడించాడు. వీరిద్దరూ కాకుండా ఓ యువ బ్యాటర్‌పై అంబటి రాయుడు మొగ్గు చూపడం విశేషం.

‘500’ వికెట్ల క్లబ్‌లో అశ్విన్‌ - జడేజా.. వారిద్దరి రికార్డుపై కన్ను !

‘‘ఇప్పుడికిప్పుడే సీఎస్‌కే సారథ్యంపై మాట్లాడటం లేదు. కానీ, భవిష్యత్తులో మాత్రం రుతురాజ్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అతడిలో నాయకత్వ లక్షణాలు పుష్కలం. మహీ భాయ్‌ నాయకత్వంలో అతడు ఓ ఏడాదిపాటు ఎదిగితే.. తప్పకుండా ఓ పదేళ్లపాటు సీఎస్‌కేను నడిపించగల సత్తా అతడికి ఉంది. ధోనీ, ఫ్లెమింగ్‌ వంటి దిగ్గజాల మార్గనిర్దేశంలో రుతురాజ్‌ రాటుదేలతాడు. అద్భుతమైన టాలెంట్‌ కలిగిన అతడు ధోనీలా నిశ్శబ్దంగా ముందుకు సాగుతాడు. భారత్‌ జట్టు తరఫునా అన్ని ఫార్మాట్లు ఆటగలడు. తప్పకుండా మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నా’’ అని అంబటి తెలిపాడు. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో రుతురాజ్‌ గైక్వాడ్ 16 మ్యాచుల్లో 590 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతోపాటు 14 అర్ధశతకాలు ఉన్నాయి. తాజాగా ఆసియా గేమ్స్‌ కోసం ప్రకటించిన జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ నడిపిస్తాడు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు చైనా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌లో టీమ్‌ఇండియా పాల్గొంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని