David Warner: మిగ్‌జాం తుపాను బాధితులకు అండగా నిలవండి.. అభిమానులను కోరిన డేవిడ్ వార్నర్

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

Updated : 07 Dec 2023 15:41 IST

ఇంటర్నెట్ డెస్క్: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో చెన్నై నగరంలో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల వల్ల చెన్నైలోని పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మిగ్‌జాం తుపాను శాంతించినప్పటికీ చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తుపాను బాధితులను ఆదుకోవాలని పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు పిలుపునిస్తున్నారు. ఆసీస్‌ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) చెన్నైలో వరదలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. తుపాను బాధితులకు అండగా నిలవాలని అభిమానులను కోరాడు. 

‘‘చెన్నైలోని అనేక ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతుండటంపై చాలా ఆందోళన చెందుతున్నా. ప్రకృతి విపత్తు వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల గురించే నా మనసు ఆలోచిస్తోంది. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటం ముఖ్యం. అవసరమైతే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించండి. ఎవరైనా సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే తప్పకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఎక్కడున్నా ఒకరికొకరు మద్దతుగా నిలవాల్సిన అవసరముంది. అందరూ కలిసి రావాలి’’ అని డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చాడు. అలాగే చెన్నై సూపర్‌ కింగ్స్ ఆటగాళ్లు రుతురాజ్‌ గైక్వాడ్, మహీశ్‌ తీక్షణ కూడా సోషల్ మీడియా ద్వారా చెన్నైలో వరదలపై స్పందించారు. చెన్నై వాసులు సురక్షితంగా ఉండాలని, అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, చెన్నైలో వరద బాధితులకు సాయం చేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి సీఎస్కే ఫ్రాంచైజీ కృతజ్ఞతలు తెలిపింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని