Mohammed Shami: ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ముందు బీసీసీఐ సెలెక్టర్లు మహ్మద్‌ షమీతో మాట్లాడారా?!

Eenadu icon
By Sports News Team Published : 12 Aug 2025 00:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) సీనియర్‌ బౌలర్‌ మహ్మద్ షమీ (Mohammed Shami) వరుస గాయాలతో జట్టుకు దూరమవుతున్నాడు. ఫిట్‌నెస్‌ సమస్యల వల్లే అతడు ఇంగ్లాండ్‌ టూర్‌కు ఎంపిక కాలేదు. అయితే జట్టును ఎంపిక చేసే ముందు అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని బీసీసీఐ (BCCI) సెలెక్షన్‌ కమిటీ షమీని సంప్రదించినట్లు సమాచారం. అయితే షమీ తన ఫిట్‌నెస్‌పై పూర్తి ధీమా వ్యక్తం చేయలేదని తెలుస్తోంది! దీంతో సెలెక్షన్‌ కమిటీ యువ పేసర్ల వైపు మొగ్గుచూపిందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. 

‘నిజానికి షమీ జట్టులో స్థానం కోల్పోవడానికి ఫామ్‌ కారణం కాదు. ఫిట్‌నెస్‌ సమస్యల వల్లే అతడు టీమ్ఇండియా స్వ్కాడ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. గత ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన తర్వాత, ఇంగ్లాండ్ సిరీస్‌ కోసం భారతజట్టుకు అతడి సేవలు చాలా అవసరం. అందుకే టీమ్‌ను ఖరారు చేసే ముందు సెలెక్టర్లు అతడితో మాట్లాడారు, కానీ షమీ తన ఫిట్‌నెస్‌పై నమ్మకంగా లేడు. అతడు సెలెక్టర్లకు హామీ ఇవ్వలేకపోయాడు. రంజీ మ్యాచుల సందర్భంగా.. షమీ మూడు, నాలుగు ఓవర్లపాటు బౌలింగ్‌ వేసి మైదానాన్ని వీడే వాడు. కాబట్టి సుదీర్ఘ ఫార్మాట్‌కు ప్రస్తుతం అతడి శరీరం సహకరిస్తుందా? అనేదే అసలు ప్రశ్న. అయితే వయసు అనేది షమీకి అడ్డంకి కాదు. అతడిలో ఇంకా కొన్ని సంవత్సరాల క్రికెట్‌ మిగిలే ఉంది’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.   

ఈ నేపథ్యంలో ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీతో షమీ టెస్ట్‌ భవిష్యత్తు తేలనుంది! అతడు ఈస్ట్‌ జోన్‌ తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి. మోకాలి గాయం నేపథ్యంలో షమీ ఎలా ఆడతాడన్నదే కీలకం కానుంది. అలాగే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ షమీ గైర్హాజరీలో యువ బౌలర్ల వైపు మొగ్గు చూపుతోంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో, ఆకాశ్‌ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ రాణించారు. అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేశాడు. అర్ష్‌దీప్ సింగ్‌ స్వ్కాడ్‌లో ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు