Team India: ఈ సారైనా చేజిక్కేనా.. టీమ్ఇండియాకు అందని ద్రాక్షగా డబ్ల్యూటీసీ టైటిల్!
ద్వైపాక్షిక సిరీస్ల్లో సత్తాచాటుతున్న టీమ్ఇండియాను.. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) టైటిల్ మాత్రం ఊరిస్తూనే ఉంది.
ఇంటా, బయట టెస్టుల్లో నిలకడగా విజయాలు.. బలమైన జట్లపై ఆధిపత్యం. తిరుగులేని ఆటతీరుతో.. అద్భుతమైన ప్రదర్శనతో.. సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా పెత్తనం చలాయిస్తోంది. తాజాగా బజ్బాల్తో భయపెట్టే పటిష్ఠమైన ఇంగ్లాండ్ను భారత జట్టు సొంతగడ్డపై అయిదు టెస్టుల సిరీస్లో 4-1తో చిత్తుచేసింది. ద్వైపాక్షిక సిరీస్ల్లో సత్తాచాటుతున్న టీమ్ఇండియాను.. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) టైటిల్ మాత్రం ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్న రోహిత్ సేన.. వరుసగా మూడో ఫైనల్ చేరే దారిలో సాగుతోంది.
ఇంగ్లాండ్ను చిత్తుచేసి
అయిదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ను 4-1 తేడాతో చిత్తుచేయడం టీమ్ఇండియాకు కలిసొచ్చింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరడమే కాదు.. మిగతా జట్లతో పోలిస్తే తుదిపోరు చేరేందుకు అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. డబ్ల్యూటీసీ 2023- 25 చక్రంలో ద్వైపాక్షిక సిరీస్లు అన్నీ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు.. టైటిల్ కోసం తలపడతాయి. ప్రస్తుతం ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో 9 మ్యాచ్లాడిన భారత్ 6 విజయాలు, ఓ డ్రా నమోదు చేసింది. రెండు మ్యాచ్ల్లో ఓడింది. దీంతో మొత్తం 74 పాయింట్లు, 68.51 పాయింట్ల శాతంతో ఉంది. రెండో స్థానంలో న్యూజిలాండ్ (5 మ్యాచ్ల్లో 3 విజయాలు, రెండు ఓటములతో 60 పాయింట్ల శాతం) ఉంది. మూడో స్థానంలో ఆస్ట్రేలియా (11 మ్యాచ్ల్లో 7 విజయాలు, మూడు ఓటములు, ఓ డ్రాతో 59.09 పాయింట్ల శాతం) కొనసాగుతోంది. కివీస్, ఆసీస్తో పోల్చి చూస్తే పాయింట్ల అంతరం పరంగా టీమ్ఇండియా మెరుగ్గా ఉంది.
ఆ సవాలు దాటితే
ఈ సైకిల్లో భారత్ ఇప్పటికే వెస్టిండీస్ (2 టెస్టులు), దక్షిణాఫ్రికా (2), ఇంగ్లాండ్ (5)తో సిరీస్లు ఆడింది. ఇంకా బంగ్లాదేశ్ (2), న్యూజిలాండ్ (3), ఆస్ట్రేలియా (5)తో సిరీస్లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో సిరీస్లు భారత్ సొంతగడ్డపై ఆడబోతోంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదనే చెప్పాలి. ఈ రెండు సిరీస్లనూ టీమ్ఇండియా క్లీన్స్వీప్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలోనే భారత్కు కఠిన సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వరుసగా రెండు సార్లు ఆస్ట్రేలియాలో భారత్ టెస్టు సిరీస్లు గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి ఎలాగైనా భారత్ను ఓడించాలనే కసితో ఆసీస్ ఉంది. పైగా కమిన్స్ సారథ్యంలో ఆ జట్టు పటిష్ఠంగా మారింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఆసీస్ పరీక్షను దాటితే కచ్చితంగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో జట్లు సాధించే ఒక్కో విజయానికి 12 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు దక్కుతాయి. మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా పాయింట్లలో కోత కూడా ఉంటుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్లో ఓ మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా భారత్కు 2 పాయింట్ల కోత పడింది.
జోరు కొనసాగిస్తే
ప్రస్తుతం భారత జట్టు బలంగా ఉంది. ఇంగ్లాండ్తో సిరీస్కు కోహ్లి, షమి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి కీలక ఆటగాళ్లు దూరమైనా యువ క్రికెటర్లు సత్తాచాటడం శుభపరిణామం. యువ ఆటగాళ్లు జోరుమీద ఉండటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా సంచలన ఓపెనర్ యశస్వి జైస్వాల్.. 16 ఇన్నింగ్స్ల్లో 68.53 సగటుతో 1,028 పరుగులతో ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బౌలింగ్లో అశ్విన్ (15 ఇన్నింగ్స్ల్లో 42 వికెట్లు) భారత్ తరపున టాప్ బౌలర్గా ఉన్నాడు. బుమ్రా 6 మ్యాచ్ల్లోనే 31 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో రోహిత్, శుభ్మన్ కూడా రెండేసి శతకాలతో ఫామ్ చాటారు. ఈ ఆటగాళ్లు ఇదే జోరు కొనసాగిస్తే 2025 జూన్లో లార్డ్స్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కచ్చితంగా తలపడుతుంది. 2021, 2023 ఫైనల్లో భారత్ వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి మన జట్టు దూకుడు చూస్తుంటే డబ్ల్యూటీసీ టైటిల్ చేజిక్కించుకునేలా కనిపిస్తోంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!