Team India: టీమ్‌ఇండియాలో చోటే లక్ష్యం.. టీ20 మెగా టోర్నీయే అవకాశం

కొద్దికాలంగా భారత జట్టులో ఆటగాళ్ల మధ్య పోటీ అధికమైంది. అటు సీనియర్లు, ఇటు యువకులతో బలమైన జట్టుగా రూపుదిద్దుకుంది. అదే సమయంలో పలువురు కీలక ఆటగాళ్లు ఫామ్‌ కోల్పోయి..

Updated : 28 Apr 2022 14:42 IST

కొద్దికాలంగా భారత జట్టులో ఆటగాళ్ల మధ్య పోటీ తీవ్రమైంది. అటు సీనియర్లు, ఇటు జూనియర్లతో బలమైన జట్టుగా రూపుదిద్దుకొంది. అదే సమయంలో పలువురు కీలక ఆటగాళ్లు ఫామ్‌ కోల్పోయి జట్టులో స్థానాలే కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. అలాంటి వారు కొందరు ఇప్పుడు టీ20 మెగా లీగ్‌లో చెలరేగుతున్నారు. రాబోయే టీ20 ప్రపంచకప్పే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. దీంతో అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. వారెవరో.. ఎలా ఆడుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..


చాహల్‌ సూపర్‌ హిట్‌: యుజ్వేంద్ర చాహల్‌ గత రెండేళ్లలో టీమ్‌ఇండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా తక్కువ మ్యాచ్‌లే ఆడాడు. వన్డేల్లో 7, టీ20ల్లో 9 మ్యాచ్‌లే ఆడటంతో జట్టులో సుస్థిర స్థానం కోసం అవస్థలు పడ్డాడు. కానీ, ఇప్పుడు జరుగుతోన్న 15వ సీజన్‌లో రాజస్థాన్‌ తరఫునే కాకుండా మొత్తం టోర్నీలోనే లీడింగ్ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7.09 ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. ఇలాగే రాణించి రాబోయే టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానం సాధించి మళ్లీ సత్తాచాటాలని చూస్తున్నాడు.


కుల్‌దీప్‌ బంపర్‌ హిట్‌: టీమ్‌ఇండియాలో చాహల్‌ కన్నా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు మణికట్టు స్పిన్‌ స్పషలిస్టు కుల్‌దీప్‌ యాదవ్‌. గత రెండేళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వన్డేలు, 3 టీ20లే ఆడిన అతడు ఈ టీ20 లీగ్‌లో గతేడాది ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అంతకుముందు సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌లే ఆడాడు. ఈ క్రమంలోనే ఈసారి దిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీస్తున్న బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు అతడు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 8.47 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. మున్ముందు కూడా ఇలా మెరిసి మళ్లీ టీమ్‌ఇండియాలో పాగా వేయాలని భావిస్తున్నాడు.


ధావన్‌ ధానాధన్‌: ఇక 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియాలో పూర్తిస్థాయి ఓపెనర్‌గా చోటు కోల్పోయిన శిఖర్‌ ధావన్‌.. గత రెండేళ్లలో 10 వన్డేలు, 10 టీ20లే ఆడాడు. అయితే, ఈ టీ20 లీగ్‌లో మెరుస్తున్నా.. మునుపటిలా తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు పంజాబ్‌ ఓపెనర్‌గా అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అతడు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 43.14 సగటుతో మొత్తం 302 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ధావన్‌ ఇలాగే రెచ్చిపోతే మళ్లీ టీమ్ఇండియాలో మెరిసే అవకాశం ఉంది.


దినేశ్‌ కార్తీక్‌ సంచలనం: చాలాకాలంగా ఫామ్‌ కోల్పోయి.. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత అసలు టీమ్‌ఇండియాలోనే చోటు కోల్పోయిన ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌. మరోవైపు ఈ టోర్నీలోనూ గత రెండు సీజన్లలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కానీ, ఈసారి బెంగళూరు తరఫున ఫినిషర్‌గా అదరగొడుతున్నాడు. సంచలన ఇన్నింగ్స్‌లతో ఆ జట్టుకు పలు విజయాలు అందించాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అతడు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 72 సగటుతో 216 పరుగులు చేశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా కార్తీక్‌ బెంగళూరు ఫినిషర్‌గా మెరుస్తున్నాడనడంలో సందేహం లేదు. ఇకపై ఆడే మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టును విజయతీరాలకు చేరిస్తే మళ్లీ టీ20 ప్రపంచకప్‌లో చోటు ఖాయమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


నటరాజన్‌ మెరుస్తున్నాడు: హైదరాబాద్‌ పేసర్‌ టి.నటరాజన్‌ కూడా ఈ సీజన్‌లో బాగా ఆకట్టుకొంటున్నాడు. అతడు 2020లోనే టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసినా గత రెండేళ్లలో కేవలం 2 వన్డేలు, 4 టీ20లు మాత్రమే ఆడాడు. అయితే, ఈ సీజన్‌లో తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు. దీంతో అతడు ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 8.41 ఎకానమీతో 15 వికెట్లు తీసి టాప్‌ బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. నటరాజన్‌ ఇలాగే రాణిస్తే ప్రపంచకప్‌ జట్టులో ఉండే ఛాన్సుంది.


ఉమేశ్‌ యాదవ్‌ కూడా: సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ కొంతకాలంగా టీమ్‌ఇండియాలో ఆడటం లేదు. గత రెండేళ్లలో నాలుగే టెస్టులు ఆడిన అతడు.. వన్డేలు, టీ20లైతే అసలే ఆడలేదు. దీంతో ఈ సీజన్‌కు ముందు అసలేమాత్రం అంచనాల్లేని బౌలర్‌గా ఉన్నాడు. కానీ, ఈ టీ20 లీగ్‌లో కోల్‌కతా జట్టులో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అతడు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7.43 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. దీంతో ఉమేశ్‌ ఇలాగే తన బౌలింగ్‌కు మరింత పదును పెడితే మళ్లీ భారత జట్టులో చేరే వీలుంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని