Bengaluru Vs Chennai: ధోనీని ఔట్‌ చేయడమే టర్నింగ్‌ పాయింట్‌.. యశ్‌కే ఈ అవార్డు: డుప్లెసిస్

ప్లేఆఫ్స్‌కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్‌ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది.

Published : 19 May 2024 09:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం. అప్పటికే ఎంఎస్ ధోనీ (25: 13 బంతుల్లో) దూకుడు మీదున్నాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (42*: 22 బంతుల్లో) ఉన్నాడు. అలాంటి సమయంలో గతేడాది రింకు సింగ్‌కు బలైన యువ బౌలర్‌ గుర్తున్నాడా? ఐదు సిక్స్‌లు ఇచ్చిన యశ్ దయాల్ చేతికి కెప్టెన్ డుప్లెసిస్ బంతినిచ్చాడు. తొలి బాల్‌కే ధోనీ సిక్స్‌ కొట్టాడు. ఇక తమ పని అయిపోయినట్లేనని ఆర్సీబీ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. కానీ, రెండో బంతిని స్లో డెలివరీగా వేసిన యశ్‌.. కీలకమైన ధోనీ వికెట్‌ను పడగొట్టాడు. అక్కడ నుంచి బెంగళూరు విజయం వైపు కొనసాగింది. ఆ ఓవర్‌లో కేవలం 7 పరుగులే ఇచ్చిన యశ్‌.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ప్రదర్శన చేసినప్పటికీ యశ్‌కు కాకుండా.. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేసిన డుప్లెసిస్‌కు (54) అవార్డు దక్కింది. మ్యాచ్‌ అనంతరం దానిని యశ్‌కు అంకితం చేస్తున్నట్లు డుప్లీ వ్యాఖ్యానించాడు. 

‘‘సొంత మైదానంలో లీగ్‌ స్టేజ్‌ను విజయంతో ముగించడం ఆనందంగా ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరడం మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఇలాంటి పిచ్‌ను ఇంతవరకెప్పుడూ చూడలేదు. తొలుత బ్యాటింగ్‌ చేయడం కఠినమే. నేను, విరాట్ ఆడుతున్నప్పుడు 150 పరుగులు చేసినా సరిపోతుందేమో అనుకున్నాం. మేం గత ఆరు మ్యాచుల్లోనూ నాణ్యమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో రాణించాం. వారిని 175కే కట్టడి చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. కానీ, ఎంఎస్ ధోనీ క్రీజ్‌లో ఉంటే ఎంతటి టార్గెట్‌ అయినా కరిగిపోతుంది. ఇలాంటి ఇన్నింగ్స్‌లను ఎన్నో ఆడాడు. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు బంతిపై పట్టు దొరకదు. కానీ మా బౌలర్లు మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. నాకు వచ్చిన ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును యశ్‌ దయాల్‌కు ఇచ్చేస్తా. ధోనీ వంటి హార్డ్‌ హిట్టర్‌ క్రీజ్‌లో ఉన్నప్పుడు కుర్రాడు ఇలా బౌలింగ్‌ చేయడం అభినందనీయం. పేస్‌ను తగ్గించి వైవిధ్యంగా బంతులేయడం సరైన నిర్ణయం. తొలి బంతినే యార్కర్‌గా వేద్దామని ప్రయత్నించాడు. కానీ, అది కుదరలేదు. దీంతో స్లో డెలివరీలే బెస్ట్‌ అని అటుగా ప్రయత్నించాడు. ధోనీని ఔట్ చేయడంతో మేం ప్లేఆఫ్స్‌ రేసులోకి వచ్చేశాం. ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. వారి మద్దతు వల్లే మేం ప్లేఆఫ్స్‌కు చేరుకోగలిగాం. వరుసగా ఆరు మ్యాచుల్లో గెలవడం మాకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. నాకౌట్‌లోనూ ఇదే దూకుడు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం’’ అని డుప్లెసిస్ వెల్లడించాడు. యశ్ దయాల్ (2/42) భారీగా పరుగులు సమర్పించినా కీలక సమయంలో వికెట్లు తీశాడు.

మరికొన్ని విశేషాలు..

  • ఐపీఎల్‌లో బెంగళూరు వరుసగా అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో సీజన్‌ ఇదే. ఇప్పటివరకు ఆరు మ్యాచుల్లో గెలిచింది. 2011లో ఏడు, 2009లో 5, 2016లో 5 మ్యాచుల్లో విజయం సాధించింది. అన్నిసార్లూ రన్నరప్‌గా నిలవడం గమనార్హం.
  • తొలి ఏడు మ్యాచుల్లో కేవలం ఒక్కదాంట్లోనే గెలిచినా.. చివరికి ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టు బెంగళూరు. చివరిసారిగా 2016లో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. చిన్నస్వామి స్టేడియంలోనే విజయం సాధించి నాకౌట్‌కు వెళ్లడం విశేషం.
  • ఒకే సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలవడం.. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయిన తొలి టీమ్‌ కూడా బెంగళూరే. ఈ సీజన్‌ లీగ్‌ స్టేజ్‌లో మూడో మ్యాచ్‌ నుంచి 8వ మ్యాచ్‌ వరకూ ఓడిపోయింది. చివరి ఆరు మ్యాచుల్లోనూ గెలిచింది.
  • ఒకే సీజన్‌లో 200+ స్కోర్లను అత్యధిక సార్లు నమోదు చేసిన మూడో జట్టు బెంగళూరు. కోల్‌కతా (2024), ముంబయి (2023)తో ఆరుసార్లు చేసి ఆర్సీబీ సమంగా కొనసాగుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని