ODI WORLD CUP: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు
తండ్రి క్రికెటర్ అయితే.. తనయడూ ఇదే మార్గంలో ఉండటం ఆశ్చర్యం కాదు కానీ.. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు ఆడటం మాత్రం ప్రత్యేకమైందే. ఇలాంటి ఘనతను నెదర్లాండ్స్కు చెందిన ఆటగాళ్లు సొంతం చేసుకున్నారు.
ప్రపంచకప్లో బాస్ డి లీడ్ మెరుపులు
1996 వన్డే ప్రపంచకప్ నాటి మాట. ఉపఖండంలో జరిగిన ఈ మెగా టోర్నీలో పాల్గొనడానికి తొలిసారి భారత్కు వచ్చింది నెదర్లాండ్స్ జట్టు. ఆడిన అయిదు మ్యాచ్ల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. కానీ పెద్ద జట్లతో ఆడిన అనుభవాన్ని మాత్రం సంపాదించింది. ఈ జట్టులో ఉన్న టిమ్ డి లీడ్కు ఈ టోర్నీ ఓ మధుర స్మృతిగా మిగిలిపోయింది.
27 ఏళ్లు గడిపోయాయి. మళ్లీ భారత్లో ప్రపంచకప్ వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత నెదర్లాండ్స్ భారత్లో అడుగుపెట్టింది. ఈసారి మరో డి లీడ్ వచ్చి పాకిస్థాన్తో తొలి మ్యాచ్లోనే సత్తా చాటాడు. అతడెవరో కాదు 1996 ప్రపంచకప్లో డచ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన టిమ్ డి లీడ్ తనయుడు బాస్ డి లీడ్. హైదరాబాద్లో పాక్తో మ్యాచ్లో బౌలింగ్లో రాణించిన ఈ కుర్రాడు.. బ్యాటింగ్లోనూ టాప్ స్కోరర్గా నిలిచాడు. జట్టు విజయం కోసం తుద వరకు పోరాడాడు. తండ్రి బాటలో నడిచిన తనయుడిగా నిలిచాడు.
భారత్పై అదరగొట్టి..
1996 ప్రపంచకప్తోనే టిమ్ డి లీడ్ ఆగిపోలేదు. 2003, 2007 ప్రపంచకప్పుల్లోనూ నెదర్లాండ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్లో అతడు తన ముద్ర వేశాడు. భారత్తో జరిగిన పోరులో టిమ్ డి లీడ్ 35 పరుగులకే 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతేకాదు సచిన్ తెందుల్కర్, ద్రవిడ్ వికెట్లు పడగొట్టి ఈ మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకున్నాడు. బలమైన భారత్ 204 పరుగులకే పరిమితమైందంటే టిమ్ డి లీడే కారణం. ఆ మ్యాచ్లో భారత్ ఎలాగోలా గట్టెక్కినా టిమ్కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ప్రస్తుతం టిమ్ డి లీడ్ కోచింగ్ ఇస్తున్నాడు. క్రీడా పరికరాల షాప్ నడుపుతున్నాడు.
తొలి మ్యాచ్లోనే..
ఇన్నేళ్లకు మళ్లీ అతడి తనయుడి రూపంలో ఆ ఇంట్లో నుంచి మరో ఆటగాడు ప్రపంచకప్ ఆడాడు. పాక్తో మ్యాచ్లో కప్ అరంగేట్రంలోనే బాస్ డి లీడ్ అదరగొట్టాడు. అప్పుడు తండ్రి మాదిరిగానే తాను కూడా 4 వికెట్లు పడగొట్టాడు. ఇంకో విశేషం ఏమిటంటే బ్యాటింగ్లోనూ రాణించి అర్ధసెంచరీ చేశాడు. ప్రపంచకప్ ఆరంభానికి ముందు నుంచే బాస్ డి లీడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. కప్ క్వాలిఫయర్స్లో స్కాట్లాండ్పై 92 బంతుల్లోనే 123 పరుగులు చేయడమే కాదు 52 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో డచ్ జట్టుకు విజయాన్ని అందించాడు. రాబోయే ప్రపంచకప్ మ్యాచ్ల్లోనూ అతడు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి.
చరిత్రలో ఏడోసారి
ప్రపంచకప్లో తండ్రి, తనయుడు ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహించడం చాలా అరుదు. అందుకే ఇన్నేళ్ల కప్ చరిత్రలో కేవలం ఏడు సందర్భాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. డాన్-డెరిక్ ప్రింగిల్, లాన్స్, క్రిస్ కెయిన్స్, క్రిస్, స్టువర్ట్ బ్రాడ్, జెఫ్ మార్ష్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్, రాడ్, టామ్ లేథమ్, కెవిన్, సామ్ కరన్.. ఇప్పుడు ఈ జాబితాలో టిమ్ డి లీడ్-బాస్ డి లీడ్ కూడా చేరారు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.