ODI WC 2023: స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ నుంచి వరల్డ్‌ కప్‌ నెట్‌ బౌలర్‌గా..!

వరల్డ్‌ కప్‌లో టైటిల్‌ ఫేవరెట్లకు షాక్‌ ఇచ్చే సత్తా నెదర్లాండ్స్‌కూ ఉంది. భారత్‌కు చేరుకున్న ఆ జట్టు తమ సాధన కోసం నలుగురిని నెట్‌ బౌలర్లుగా ఎంపిక చేసుకుంది.

Published : 21 Sep 2023 16:08 IST

ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు వారాల్లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) సమరం ప్రారంభం కానుంది. నెదర్లాండ్స్‌ క్రికెట్ జట్టు ఇప్పటికే ఇక్కడకు చేరుకుని సాధనను ముమ్మరం చేసింది. అందుకోసం భారత్‌కు చెందిన నలుగురిని నెట్‌ బౌలర్లుగా నెదర్లాండ్స్‌ జట్టు ఎంపిక చేసుకుంది. వీరిలో చెన్నైకి చెందిన లోకేశ్‌ కుమార్‌ ఉన్నాడు. ఇందులో ప్రత్యేకత ఏమంటే..? అతడు స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ కావడం గమనార్హం. 

నెట్ బౌలర్ల కోసం భారత్‌వ్యాప్తంగా నెదర్లాండ్స్‌ జట్టు వెతుకులాట నిర్వహించింది. దానికోసం భారీగా ప్రకటన ఇచ్చింది. దేశం నలుమూలల నుంచి దాదాపు 10 వేల మంది తమ బౌలింగ్‌ వీడియోలను పంపించారు. అన్నీ పరిశీలించిన నెదర్లాండ్స్‌ మేనేజ్‌మెంట్ నలుగురిని సెలెక్ట్‌ చేసుకుంది. తమ నెట్‌ బౌలర్లను పరిచయం చేస్తూ నెదర్లాండ్స్‌ టీమ్‌ ట్విటర్ వేదికగా (ప్రస్తుతం ఎక్స్‌) వీడియోను షేర్ చేసింది. అందులో చెన్నైకి చెందిన లోకేశ్‌ కుమార్‌ స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే క్రికెటర్‌గా రాణిస్తున్నాడని ఓ జాతీయ వెబ్‌సైట్‌ కథనం వెల్లడించింది. నెదర్లాండ్స్ జట్టుకు నెట్‌బౌలర్‌గా ఎంపిక కావడంపై లోకేశ్‌ కుమార్‌ ఆనందం వ్యక్తం చేశాడు. 

‘‘చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. దాదాపు నాలుగేళ్లపాటు డివిజన్‌-5 విభాగంలో ఆడాను. ఆ తర్వాత ఇండియన్ ఆయిల్ జట్టుకు డివిజన్-4  క్రికెట్‌లోకి రిజిస్టర్‌ చేసుకున్నా. ఇప్పుడు నెదర్లాండ్స్‌ జట్టుకు వరల్డ్ కప్‌ సందర్భంగా నెట్‌బౌలర్‌గా ఎంపిక కావడం మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా ఉంది. నా ప్రతిభను గుర్తించినందుకు ధన్యవాదాలు’’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించాడు. నెదర్లాండ్స్‌ అక్టోబర్ 6 నుంచి పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌తో వన్డే ప్రపంచకప్‌ సమరం ప్రారంభించనుంది. అయితే, అంతకుముందు భారత్‌తో (అక్టోబర్ 3న) వార్మప్‌ మ్యాచ్‌లో తలపడనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని