BCCI: ఇషాన్‌ కిషన్‌ ఎఫెక్ట్‌.. రంజీ ఆడితేనే ఐపీఎల్‌..!

కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడడానికి అయిష్టత చూపిస్తూ కేవలం ఐపీఎల్‌ మీదే దృష్టిపెట్టడం బీసీసీఐ కొత్త నిబంధన తేవడానికి కారణమైంది.

Updated : 14 Feb 2024 12:20 IST

ముంబయి: కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడడానికి అయిష్టత చూపిస్తూ కేవలం ఐపీఎల్‌ మీదే దృష్టిపెట్టడం బీసీసీఐ కొత్త నిబంధన తేవడానికి కారణమైంది. భారత జట్టులో లేనపుడు ఐపీఎల్‌లో పాల్గొనాలంటే ఓ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడడాన్ని బీసీసీఐ తప్పనిసరి చేయనుంది. రంజీల్లో ఝార్ఖండ్‌ చివరి గ్రూప్‌ మ్యాచ్‌ (16 నుంచి రాజస్థాన్‌తో) ఆడాలని ఇషాన్‌ కిషన్‌ను బోర్డు ఇప్పటికే ఆదేశించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చాక, ప్రయాణ బడలికను కారణంగా చూపిస్తూ ఝార్ఖండ్‌ మ్యాచ్‌లకు అతడు వరుసగా డుమ్మా కొట్టడం బీసీసీఐ పెద్దలకు నచ్చలేదట.

మరొక విషయం ఏంటంటే.. తన రాష్ట్ర జట్టు గ్రూప్‌-ఏలో దాదాపుగా అట్టడుగున ఉండగా, కిషన్‌ మాత్రం ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌తో కలిసి బరోడాలో సాధన చేస్తున్నట్లు బోర్డుకు తెలిసింది. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లు కేవలం ఐపీఎల్‌లో ఆడడంపైనే దృష్టిపెట్టకుండా చూసేందుకు కఠిన విధానం అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది బీసీసీఐ. ‘‘కొందరు ఆటగాళ్లు ఎర్ర బంతి క్రికెట్‌ ఆడాలనుకోవట్లేదని బీసీసీఐ గ్రహించింది. వాళ్లు భారత జట్టులో లేకపోతే మహా అయితే ముస్తాక్‌ అలీ టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నారు. రెడ్‌ బాల్‌ సీజన్‌ మొదలయ్యాక రాష్ట్ర సంఘానికి రిపోర్ట్‌ చేయట్లేదు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ‘‘అలాంటి ఆటగాళ్లను అదుపు చేయడానికి.. కనీసం 3-4 రంజీ మ్యాచ్‌లు ఆడడాన్ని తప్పనిసరి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. లేదంటే వాళ్లు ఐపీఎల్‌ లేదా ఫ్రాంఛైజీలు విడుదల చేసినపుడు ఐపీఎల్‌ వేలంలో పాల్గొనడానికి అనర్హులవుతారు’’ అని పేర్కొన్నాడు.

అలాంటి అంశం చర్చకు రాలేదు: బీసీసీఐ వర్గాలు

రంజీల్లో లేదా దేశవాళీలో ఆడకపోతే ఇషాన్‌ కిషన్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తారనే చర్చ మొదలైంది. అయితే, దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ‘‘సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లకు సంబంధించి చర్చే జరగలేదు. ప్రతి ఒక్కరూ డొమిస్టిక్‌ క్రికెట్ ఆడాలనేది బోర్డు ఆకాంక్ష. ఇప్పటికైతే కాంట్రాక్ట్‌లను రద్దు చేసే యోచన చేయడం లేదు’’ అని ఓ అధికారి తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని