143.. అయినా కష్టంగా!

ఓవైపు కొన్ని జట్లు సిక్సర్ల మోత మోగించేస్తూ 250 పైచిలుకు స్కోర్లు నమోదు చేస్తున్న ఈ ఐపీఎల్‌లో ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌ ప్రత్యర్థికి 143 పరుగుల లక్ష్యమే నిర్దేశించింది.

Updated : 22 Apr 2024 07:05 IST

మెరిసిన తెవాతియా.. టైటాన్స్‌ గెలుపు 
విజృంభించిన స్పిన్నర్లు
పంజాబ్‌కు ఆరో ఓటమి

ముల్లాన్‌పూర్‌

వైపు కొన్ని జట్లు సిక్సర్ల మోత మోగించేస్తూ 250 పైచిలుకు స్కోర్లు నమోదు చేస్తున్న ఈ ఐపీఎల్‌లో ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌ ప్రత్యర్థికి 143 పరుగుల లక్ష్యమే నిర్దేశించింది. అయినా సరే.. చిన్న లక్ష్యాన్ని కాపాడుకునేందుకు పంజాబ్‌ గట్టిగానే పోరాడింది. కానీ ఒత్తిడిలో రాహుల్‌ తెవాతియా (36 నాటౌట్‌; 18 బంతుల్లో 7×4) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో టైటాన్స్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (35; 21 బంతుల్లో 3×4, 3×6) టాప్‌ స్కోరర్‌. స్పిన్నర్లు సాయికిశోర్‌ (4/33), నూర్‌ అహ్మద్‌ (2/20), రషీద్‌ ఖాన్‌ (1/15) ఆ జట్టును దెబ్బతీశారు. మోహిత్‌ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. తెవాతియాతో పాటు గిల్‌ (35; 29 బంతుల్లో 5×4) రాణించడంతో లక్ష్యాన్ని టైటాన్స్‌ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్షల్‌ పటేల్‌ (3/15), లివింగ్‌స్టన్‌ (2/19) బంతితో రాణించారు. ఆరో పరాజయంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను పంజాబ్‌ మరింత సంక్లిష్టం చేసుకుంది.

స్వల్ప లక్ష్యమే అయినా..: లక్ష్యం చిన్నదే అయినా గుజరాత్‌ చెమటోడ్చింది. పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు తేలికగా రాలేదు. గిల్‌, సాయిసుదర్శన్‌ (31; 34 బంతుల్లో 3×4) రాణించినా.. ధాటిగా ఆడలేదు. సాహా (13), మిల్లర్‌ (4), అజ్మతుల్లా (13) విఫలమయ్యారు. 16 ఓవర్లకు టైటాన్స్‌ స్కోరు 105/5. చివరి 4 ఓవర్లలో 38 పరుగులు చేయాల్సి స్థితిలో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. పంజాబ్లో ఆశలు చిగురించాయి. కానీ తెవాతియా అదిరే బ్యాటింగ్‌తో ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. అతడు బ్రార్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రబాడ ఓవర్లో మూడు ఫోర్లు బాదడంతో మ్యాచ్‌ పూర్తిగా టైటాన్స్‌ వైపు తిరిగింది. చివరి రెండు ఓవర్లలో అయిదు పరుగులు చేయాల్సిన స్థితిలో గుజరాత్‌ లక్ష్యం చాలా తేలికైపోయింది. షారుక్‌ (8), రషీద్‌ (3) ఔటైనా.. ఆ జట్టుకు కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. అంతకుముందు పంజాబ్‌ ప్రదర్శన పేలవం. సాయికిశోర్‌ నేతృత్వంలో టైటాన్స్‌ స్పిన్నర్లు కింగ్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేశారు. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్లలో ఒకటైన పంజాబ్‌.. నిజానికి ఈసారి మెరుగ్గానే ఆరంభించింది. ప్రభ్‌సిమ్రన్‌ బ్యాట్‌ ఝళిపించడంతో 5 ఓవర్లలో 45/0తో నిలిచింది. కానీ ప్రభ్‌సిమ్రన్‌ను మోహిత్‌ ఔట్‌ చేశాక పంజాబ్‌ ఇన్నింగ్స్‌ గమనమే మారిపోయింది. ఆ తర్వాత స్పిన్నర్లు ఆ జట్టును కట్టిపడేశారు. రొసో (9)ని నూర్‌ ఔట్‌ చేయగా.. ఓపెనర్‌ సామ్‌ కరన్‌ (20)ను రషీద్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లివింగ్‌స్టన్‌ (6)ను నూర్‌ ఎక్కువసేపు నిలువనివ్వలేదు. ఆ తర్వాత జితేశ్‌ శర్మ (13), అశుతోష్‌ శర్మ (3), శశాంక్‌ సింగ్‌ (8)లను సాయికిశోర్‌ వెనక్కి పంపడంతో 16వ ఓవర్లు ముగిసే సరికి 107/7తో నిలిచింది పంజాబ్‌. ఆఖర్లో హర్‌ప్రీత్‌ బ్రార్‌ (29; 12 బంతుల్లో 4×4, 1×6) కాస్త బ్యాట్‌ ఝళిపించడంతో ఆ జట్టు 140 దాటగలిగింది.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: కరన్‌ ఎల్బీ (బి) రషీద్‌ ఖాన్‌ 20; ప్రభ్‌సిమ్రన్‌ (సి) సాహా (బి) మోహిత్‌ 35; రొసో ఎల్బీ (బి) నూర్‌ 9; జితేశ్‌ (బి) సాయికిశోర్‌ 13; లివింగ్‌స్టన్‌ (సి) తెవాతియా (బి) నూర్‌ 6; శశాంక్‌ (సి) అండ్‌ (బి) సాయికిశోర్‌ 8; అశుతోష్‌ (సి) మోహిత్‌ (బి) సాయికిశోర్‌ 3; హర్‌ప్రీత్‌ రనౌట్‌ 14; బ్రార్‌ (సి) షారుక్‌ (బి) సాయికిశోర్‌ 29; హర్షల్‌ (సి) షారుక్‌ (బి) మోహిత్‌ 0; రబాడ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్‌) 142; వికెట్ల పతనం: 1-52, 2-63, 3-67, 4-78, 5-86, 6-92, 7-99, 8-139, 9-140; బౌలింగ్‌: అజ్మతుల్లా 2-0-13-0; సందీప్‌ వారియర్‌ 1-0-21-0; మోహిత్‌ 4-0-32-2; రషీద్‌ 4-0-15-1; నూర్‌ 4-0-20-2; సాయికిశోర్‌ 4-0-33-4; షారుక్‌ 1-0-7-0

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) అశుతోష్‌ (బి) అర్ష్‌దీప్‌ 13; గిల్‌ (సి) రబాడ (బి) లివింగ్‌స్టన్‌ 35; సాయి సుదర్శన్‌ (బి) కరన్‌ 31; మిల్లర్‌ (బి) లివింగ్‌స్టన్‌ 4; అజ్మతుల్లా (సి) జితేశ్‌ (బి) హర్షల్‌ 13; తెవాతియా నాటౌట్‌ 36; షారుక్‌ (బి) హర్షల్‌ 8; రషీద్‌ (సి) రొసో (బి) హర్షల్‌ 3; సాయి కిశోర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (19.1 ఓవర్లలో 7 వికెట్లకు) 146; వికెట్ల పతనం: 1-25, 2-66, 3-77, 4-97, 5-103, 6-138, 7-142; బౌలింగ్‌: రబాడ 4-0-40-0; అర్ష్‌దీప్‌ 2.1-0-17-1; హర్షల్‌ 3-0-15-3; కరన్‌ 2-0-18-1; బ్రార్‌ 4-0-35-0; లివింగ్‌స్టన్‌ 4-0-19-2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని