Virat Kohli: విరాట్కు రెండో వైపు.. అప్పుడు స్మిత్కు అండ.. ఇప్పుడు నవీనుల్కు బాసట
విరాట్ కోహ్లి (Virat Kohli) అంటే దూకుడుకు మారుపేరు. ప్రత్యర్థి ఆటగాళ్లెవరైనా అతడితో పెట్టుకుంటే అంతే సంగతులు. అవతలి ఆటగాడు ఒక మాట అంటే అతను రెండు మాటలు అంటాడు. బౌలర్లు కవ్విస్తే బ్యాటుతో వారికి సమాధానం చెబుతాడు. సై అంటే సై అన్నట్లే ఉంటుంది అతడి వ్యవహారం.
విరాట్ కోహ్లి అంటే దూకుడుకు మారుపేరు. ప్రత్యర్థి ఆటగాళ్లెవరైనా అతడితో పెట్టుకుంటే అంతే సంగతులు. అవతలి ఆటగాడు ఒక మాట అంటే అతను రెండు మాటలు అంటాడు. బౌలర్లెవరైనా కవ్విస్తే బ్యాటుతో వారికి సమాధానం చెబుతాడు. సై అంటే సై అన్నట్లే ఉంటుంది అతడి వ్యవహారం. కొన్నిసార్లు కోహ్లి మరీ ఎక్కువ స్పందిస్తాడని.. ప్రత్యర్థులతో అమర్యాదరకంగా వ్యవహరిస్తాడని అప్పుడప్పుడూ విమర్శలు కూడా వస్తుంటాయి. అయిదే ఇదంతా కోహ్లిలో నాణానికి ఒకవైపు! అవసరమైనపుడు ప్రత్యర్థులను గౌరవించడం, వారికి బాసటగా నిలవడంలోనూ కోహ్లి ముందుంటాడు. అఫ్గానిస్థాన్తో ప్రపంచకప్ మ్యాచ్లో నవీనుల్ హక్ విషయంలో అతను వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం.
వన్డే ప్రపంచకప్లో భాగంగా బుధవారం దిల్లీలో అఫ్గానిస్థాన్తో తలపడి ఘనవిజయం సాధించింది భారత్. ఈ మ్యాచ్లో అందరి దృష్టినీ ఆకర్షించిన దృశ్యం.. అఫ్గానిస్థాన్ పేసర్ నవీనుల్ హక్తో స్నేహంగా మెలగడమే. ఈ ఏడాది ఐపీఎల్లో వీళ్లిద్దరికీ జరిగిన గొడవను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఆ గొడవ తర్వాత నవీనుల్.. కోహ్లి అభిమానులకు విలన్ అయిపోయాడు. అతను ఎక్కడ మ్యాచ్ ఆడినా.. ‘‘కోహ్లి కోహ్లి’’ అంటూ అరవడమే పనిగా పెట్టుకున్నారు విరాట్ ఫ్యాన్స్. ప్రపంచకప్లో అఫ్గాన్ ఆడిన తొలి మ్యాచ్లోనూ నవీనుల్ బౌలింగ్కు వచ్చినపుడల్లా ‘‘కోహ్లి’’ నినాదాలు వినిపించాయి. ఇక భారత్తో మ్యాచ్లో అయితే ఈ నినాదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
దిల్లీ కోహ్లి సొంత నగరం కావడంతో అతడి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాళ్లు నవీనుల్ను లక్ష్యంగా చేసుకున్నారు. అతను బ్యాటింగ్కు వచ్చినపుడు స్టేడియమంతా కోహ్లి నినాదాలు హోరెత్తాయి. ఆపై కోహ్లికి నవీనుల్ బంతులేస్తున్నపుడు అభిమానులు ఇంకా రెచ్చిపోయారు. అయితే ప్రత్యర్థి ఆటగాడిని ఇలా లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యవహరించడం కోహ్లికి నచ్చలేదు. నవీనుల్ తనతో గొడవపడ్డప్పుడు విరాట్ ఎంత ఆగ్రహం ప్రదర్శించాడో తెలిసిందే. కానీ అభిమానులు ఇప్పుడిలా చేయడం విరాట్కు రుచించలేదు. అందుకే తర్వాత అభిమానుల వైపు చేత్తో సంజ్ఞ చేస్తూ నినాదాలు ఆపేయమన్నాడు. దీంతో ఫ్యాన్స్ శాంతించారు. తర్వాత నవీనుల్తో నవ్వుతూ మాట్లాడ్డమే కాక.. అతడి భుజంపై చేయి వేసి సన్నిహితంగా కనిపించాడు విరాట్. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. మన అతిథి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించిన కోహ్లిని కొనియాడుతూ నెటిజన్లు అతణ్ని ప్రశంసల్లో ముంచెత్తారు.
ఏంటి వాళ్లిద్దరి గొడవ?
ఈ ఏడాది ఐపీఎల్లో బెంగళూరు-లఖ్నవూ మ్యాచ్ సందర్భంగా కోహ్లికి, నవీనుల్కు పెద్ద గొడవే నడిచింది. నవీనుల్ ఔటైనపుడు కోహ్లి తన షూను చూపిస్తూ అతణ్ని ఏదో అన్నాడు. దీంతో నవీనుల్ కూడా ఏదో తిడుతూ పెవిలియన్కు వెళ్లాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకునేటపుడు నవీనుల్.. కోహ్లితో కొంత అమర్యాదకరంగా వ్యవహరించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత కూడా నవీనుల్ తగ్గలేదు. బెంగళూరు ఓ మ్యాచ్లో ఓడినపుడు వ్యంగ్యంగా ఒక పోస్టు పెట్టాడు. దీంతో కోహ్లి అభిమానులకు అతను లక్ష్యంగా మారాడు. అప్పట్నుంచి అతను ఇండియాలో ఎక్కడ మ్యాచ్ ఆడినా.. కోహ్లి నినాదాలతో అభిమానులు గోల గోల చేస్తున్నారు. ప్రపంచకప్లోనూ అఫ్గానిస్థాన్ ఆడిన తొలి మ్యాచ్లో అదే చేశారు. కానీ భారత్తో మ్యాచ్ సందర్భంగా ఈ గొడవకు కోహ్లి తెరదించాడు.
అప్పుడు స్మిత్ కోసం..
విరాట్ ప్రత్యర్థి ఆటగాడికి బాసటగా నిలవడం తొలిసారేమీ కాదు. 2019లో అతను ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు అండగా నిలబడిన తీరు ప్రశంసలందుకుంది. స్మిత్ అంతకుముందు ఏడాదే బాల్ టాంపరింగ్ కుంభకోణంలో భాగం కావడం వల్ల ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. నిషేధం పూర్తి చేసుకున్నాక వన్డే ప్రపంచకప్లో ఆడుతుండగా.. భారత్తో మ్యాచ్లో అభిమానులు అతణ్ని గేలి చేశారు. స్మిత్ మోసగాడన్నట్లుగా కొందరు నినాదాలు చేశారు. చేసిన తప్పుకి శిక్ష కూడా అనుభవించాక స్మిత్ను ఇలా అభిమానులు లక్ష్యంగా చేసుకోవడం కోహ్లికి నచ్చలేదు. దీంతో అతను అలా చేయొద్దంటూ అభిమానులను వారించాడు. దీంతో స్టేడియం సద్దుమణిగింది. ఈ చర్యతో స్మిత్ కోహ్లి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు కూడా చెప్పాడు. తర్వాత ఐసీసీ.. కోహ్లికి ‘స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్’ అవార్డు కూడా ఇవ్వడం విశేషం.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.