Dhoni: సింహం ఎక్కడైనా సింహమే.. ముంబయిలోనూ ‘ధోనీ’ ఫీవర్

సింహం ఎక్కడైనా సింహమే. అది అడవిలో ఉన్నా.. అడవి విడిచి బయటకు వచ్చినా.. ఎలాంటి తేడా ఉండదు. చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా అంతే...

Updated : 11 Dec 2022 17:35 IST

ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం: సింహం ఎక్కడైనా సింహమే. అది అడవిలో ఉన్నా.. అడవి విడిచి బయటకు వచ్చినా.. ఎలాంటి తేడా ఉండదు. చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా అంతే.. అతడు చెన్నైలో ఛేదించినా.. దుబాయ్‌లో దూకుడుగా ఆడినా.. ముంబయిలో మురిపించినా.. ఎక్కడైనా ఒక్కటే తీరు. ప్రశాంతంగా ఉంటూ తన ఆటతో ప్రత్యర్థులను చిత్తు చేయడమే అతడికి తెలిసింది. గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనూ అదే చేశాడు. దీంతో అతడిని ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో తనలో ఇంకా మునుపటి సత్తా ఉందని చెప్పకనే చెప్పాడు. ఈ మ్యాచ్‌లోని పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

అభిమానం అంటే ఇదీ..

* ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆటగాడు చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ. అతడు ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అది చెన్నై, దుబాయ్‌, ముంబయి.. ఎక్కడైనా సరే. మరీ ముఖ్యంగా తన సొంత ఊరు రాంచీ కన్నా.. చెన్నై అభిమానులే మహీ పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తారు. అది ముంబయితో నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ కనిపించింది. డీవైపాటిల్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. స్థానిక జట్టు అభిమానుల కన్నా చెన్నై అభిమానులే సందడి చేశారు.

నువ్వే మా సారథి..

* మహీ క్రీజులోకి వచ్చినప్పుడు స్టాండింగ్‌ ఓవియేషన్‌తో ఘన స్వాగతం పలికిన అభిమానులు.. చివరి బంతికి అతడు ఫోర్ కొట్టి చెన్నైని విజయతీరాలకు చేర్చేంతవరకూ ‘ధోనీ’ పేరును స్టేడియంలో మార్మోగించారు. స్టేడియంలో ఏ మూలన చూసినా అతడి అభిమానులే. చెన్నై జెండాను ఊపుతూ ఆ జట్టుకు పూర్తి మద్దతు పలికారు. ఇక 20వ ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 17 పరుగులు అవసరమైన వేళ వాళ్ల సందడి అంతా ఇంతా కాదు. స్టేడియం మొత్తం ధోనీ ధోనీ అనే నామ స్మరణతో సందడి నెలకొంది. ఇప్పుడు జడేజా కెప్టెన్‌ అయినా, మహీనే మా సారథి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

నమ్మకాన్ని నిలబెట్టుకొని..

* ముంబయి ఈ మ్యాచ్‌లో 155 పరుగులే చేసినా ఆ స్కోరును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. అద్భుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను చివరివరకూ నడిపించారు. దీంతో ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే చెన్నై గెలవడానికి బాగా కష్టపడింది. జయదేవ్‌ ఉనద్కత్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికే  ప్రిటోరియస్‌ (23) వికెట్‌ పడగొట్టి చెన్నై అభిమానుల్లో కాస్త కంగారు పెట్టించాడు. అయితే, వాళ్లకు ధోనీ ఉన్నాడనే నమ్మకం ఉంది. దీంతో వాళ్ల నమ్మకాన్ని నిజం చేస్తూ ధోనీ ఎప్పటిలాగే ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

ఒత్తిడినే చిత్తు చేస్తూ..

* ఆఖరి ఓవర్‌లో పరిస్థితులు కఠినంగా ఉన్నా ధోనీ చాలా కూల్‌గా కనిపించాడు. తన ముఖంలో ఏమాత్రం ఆందోళన, తడబాటు కనపడలేదు. అలా కనిపిస్తే అతడు ధోనీ ఎందుకవుతాడు! తొలి బంతికే వికెట్‌ పడ్డాక క్రీజులోకి వచ్చిన బ్రావో(1) సింగిల్‌ తీసిచ్చాడు. దీంతో బ్యాటింగ్‌ ఎండ్‌లోకి వచ్చిన ధోనీ.. మిగతా నాలుగు బంతుల్లో 16 పరుగులు సాధించాడు. మూడో బంతిని లాంగాఫ్‌ మీదుగా సిక్సర్‌ సంధించిన తర్వాత.. నాలుగో బంతిని డీప్‌ ఫైన్‌లెగ్‌లో బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి రెండు పరుగులు తీసి.. ఆఖరి బంతిని లాంగ్‌ లెగ్‌లోకి దంచికొట్టాడు. అంతే చెన్నైకి అపురూప విజయాన్ని అందించాడు. చివరికి గావస్కర్‌ కూడా మహీ ఆటకు ఫిదా అయ్యాడు. అతడిలా ఆడితే ఎవరూ ఏం చేయలేరన్నాడు.

జడేజా తలవంచి గౌరవించి‌..

* చెన్నై జట్టుకు ఇప్పుడు రవీంద్ర జడేజా కెప్టెన్‌ అయినా ధోనీకి తగినంత గౌరవం ఇచ్చాడు. మ్యాచ్‌ గెలిచాక మైదానంలోకి వచ్చిన జడ్డూ తన మాజీ సారథి ముందు తన క్యాప్‌ తీసి తలవంచి నమస్కరించాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దీంతో జడ్డూ.. ధోనికి ఎంత విలువ ఇస్తాడో తెలిసొచ్చింది. మీరూ ఆ వీడియోలు చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని