Mayank Yadav: నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. అదే నా లక్ష్యం: మయాంక్‌

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ యువ సంచలనం మయాంక్‌ యాదవ్‌ మరోసారి అదిరిపోయే ప్రదర్శనతో అదరగొట్టాడు.

Updated : 03 Apr 2024 03:08 IST

బెంగళూరు: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో బెంగళూరు (Bengaluru)ను తన సొంతమైదానంలో ఓడించి ఈ మెగా టోర్నీలో లఖ్‌నవూ (Lucknow) రెండో విజయాన్ని నమోదు చేసింది. యువ ఆటగాడు మయాంక్‌ యాదవ్‌ (Mayank Yadav) సంచలన బౌలింగ్‌తో బెంగళూరును వణికించాడు. తొలుత డికాక్‌ (81), పూరన్‌ (40) చెలరేగడంతో 5 వికెట్ల నష్టానికి లఖ్‌నవూ 181 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును 19.4 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూల్చింది. మహిపాల్‌ లోమ్రోర్‌ (33) టాప్‌ స్కోరర్‌. రజత్‌ పటీదార్‌ (29), కోహ్లీ (22), డుప్లెసిస్‌ (19) పరుగులు చేశారు. మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. లఖ్‌నవూ బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌ 3, నవీనుల్‌ హఖ్‌ 2, యశ్‌ ఠాకూర్‌, స్టోయినిస్‌, సిద్ధార్థ్‌ తలో వికెట్‌ తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు.

దేశానికి ఆడడమే అంతిమ లక్ష్యం..

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన అనంతరం మయాంక్‌ మాట్లాడాడు. ‘‘వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికవ్వడం ఆనందంగా ఉంది. రెండు మ్యాచుల్లోనూ మేము గెలిచాం. ఎప్పటికైనా దేశానికి ఆడడమే నా అంతిమ లక్ష్యం. నా ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించానని అనుకుంటున్నా. కామెరూన్‌ గ్రీన్‌ వికెట్‌ను తీసినందుకు ఎంతో సంతోషించాను. వేగంగా బౌలింగ్‌ చేయడానికి డైట్‌, సరిపడ నిద్ర, శిక్షణ చాలా అవసరం. వేగంగా రికవరీ కావడానికి చన్నీటి స్నానం, డైట్‌పై నిరంతరం శ్రద్ధపెడుతున్నాను’’ అని మయాంక్‌ పేర్కొన్నాడు.

156.7 కి.మీ బౌలింగ్‌తో టాప్‌ 4కి..

ఆడిన తొలి మ్యాచ్‌లోనే సంచలన బౌలింగ్‌తో సర్వత్రా ప్రశంసలు అందుకున్న మయాంక్‌.. రెండో మ్యాచ్‌లోనూ అలాంటి ప్రదర్శనే ఇచ్చాడు. ఫలితంగా వరుసగా రెండు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. 4 ఓవర్లు వేసిన అతడు కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లోనూ గంటకు 150 కి.మీ వేగంతో బంతులేసిన మయాంక్‌.. ఒక బంతిని 156.7 కి.మీ వేగంతో వేసి రికార్డు సృష్టించాడు. దీంతో ఐపీఎల్‌ టోర్నీలోనే అత్యంత వేగంగా వేసిన బౌలర్ల జాబితాలో టాప్‌ 4కి చేరుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని