IPL 2024: ఆర్సీబీకి కోహ్లీతో కలిసి బాబర్‌ ఆడితే.. పాక్‌ అభిమాని పోస్టు.. హర్భజన్‌ కౌంటర్‌

పాకిస్థాన్‌ క్రికెటర్లకు ఐపీఎల్‌లో (IPL) ఆడే అవకాశం లేదు. అయినా, కొందరు అభిమానులు మాత్రం తమ దేశ క్రికెటర్లు భారత స్టార్లతో కలిసి ఆడితే చూడాలని ఉందని కోరుకుంటున్నారు.

Published : 16 Mar 2024 00:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌కు (IPL) భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇక దాయాది పాకిస్థాన్‌లో అయితే.. ఈ మెగా టోర్నీని ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగానే ఉంటుంది. అక్కడి లీగ్‌లతో సమానంగా ఈ టోర్నీని వీక్షిస్తుంటారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఓ పాక్‌ అభిమాని తన మనసులోని కోరికను సోషల్‌ మీడియాలో బయటపెట్టాడు. పాక్‌ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడితే చూడాలనుందని పేర్కొన్నాడు.

ఆర్సీబీకి విరాట్‌ కోహ్లీతోపాటు (Virat Kohli) బాబర్‌ అజామ్‌ ఆడితే చూడాలని ఉందని అతడు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అంతటితో ఆగలేదు ఆ అభిమాని. షాహిన్‌ అఫ్రిదీ, బుమ్రా కలిసి ముంబయి ఇండియన్స్‌కు ఆడాలని.. ధోనీ సీఎస్కే జట్టులో రిజ్వాన్‌ ఉంటే బాగుంటుందని ఇలా తన చిట్టాను వివరించాడు. ఇది భారత్‌, పాక్‌ క్రికెట్‌ అభిమానుల కల అంటూ ఆయా జెర్సీల్లో క్రియేట్‌ చేసిన ఫొటోలను పంచుకున్నాడు. దీనిపై మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘భారతీయులెవరికీ అలాంటి కల లేదు. మీరు కలలు కనడం ఆపండి. మేల్కొనండి బాయ్స్‌’’ అంటూ పాక్‌ అభిమానికి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

తొలి సీజన్‌లో పాక్ ప్లేయర్లు కూడా ఐపీఎల్‌లో ఆడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాయాది దేశం ఆటగాళ్లపై ఈ టోర్నీలో ఆడకుండా నిషేధం విధించారు. ఇక ఈ ఐపీఎల్‌ సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని