Playoffs Race : గుజరాత్‌ దూసుకెళ్లింది.. మరి మిగతా మూడు జట్లు ఏవి..?

ఐపీఎల్‌(IPL 2023)లో ప్లేఆఫ్స్‌ రేసు(Playoffs Race) హోరాహోరీగా కొనసాగుతోంది. గుజరాత్‌ టైటాన్స్‌ అధికారికంగా ప్లేఆఫ్స్‌లోకి చేరిన తొలి జట్టుగా నిలిచింది. మిగతా మూడు స్థానాల్లో నిలిచేందుకు ఆయా జట్లకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తే..

Updated : 16 May 2023 12:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఐపీఎల్‌ (IPL 2023)లో లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఆయా జట్ల మధ్య ప్లేఆఫ్స్‌ రేసు(Playoffs Race) తీవ్రంగా కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో ప్రతి మ్యాచూ, పాయింటూ కీలకమవడంతో.. విజయాలపైనే కాదు జట్లు నెట్‌ రన్‌రేట్‌పై కూడా దృష్టి సారిస్తున్నాయి. దాదాపు అన్ని జట్లు ఇంకా ఒకటో రెండో మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఇక సోమవారం సన్‌రైజర్స్‌పై విజయంతో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్‌ 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌ చేరింది. మరి ప్లేఆఫ్స్‌ చేరే అవకాశమున్న మిగతా జట్లను పరిశీలిస్తే..

మొత్తం పది జట్లు ఆడే ఐపీఎల్‌లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ప్లేఆఫ్స్‌ చేరుకుంటాయన్న విషయం తెలిసిందే. ఇందులో తొలి రెండు స్థానాలు ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. దీంతో ప్లేఆఫ్స్‌లో నిలిచే జట్లు టాప్‌ 2లో నిలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి.

గుజరాత్‌ (Gujarat Titans) : ప్రస్తుతం 18 పాయింట్లు.. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు ఒకటి(బెంగళూరుతో)

ఈ సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ.. ప్లేఆఫ్స్‌లో చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆడాల్సింది ఇంకో మ్యాచ్‌ మాత్రమే. ఇక చివరి మ్యాచ్‌లోనూ ఆర్బీబీపై గెలిస్తే ముంబయి ఆడే మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా టాప్‌-1లోనే కొనసాగుతుంది. 

చెన్నై (Chennai Super Kings) : ప్రస్తుతం 15 పాయింట్లు.. ఆడాల్సింది ఒక మ్యాచ్‌(దిల్లీతో)

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆదివారం కోల్‌కతాపై ఓడిపోవడం చెన్నైపై ప్రభావం చూపనుంది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్‌ 2 స్థానాల్లో నిలిచే అవకాశాలు 37 శాతానికి తగ్గాయి. చివరి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో వారి సొంతమైదానంలో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడితే ఇతర జట్ల ఫలితాలపై చెన్నై భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. అప్పుడు, ముంబయి, లఖ్‌నవూ, బెంగళూరుతో పోటీ పడాల్సి ఉంటుంది.

ముంబయి(Mumbai Indians) : ప్రస్తుతం 14 పాయింట్లు.. ఆడాల్సిన మ్యాచ్‌లు రెండు(లఖ్‌నవూ, సన్‌రైజర్స్‌తో)

ముంబయి ఇండియన్స్‌.. పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 18 పాయింట్లతో క్వాలిఫయర్‌ 1లోనే ప్లేస్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. రెండూ ఓడిపోతే.. కింద ఉన్న ఇతర జట్లు ముంబయిని అధిగమిస్తాయి.  ప్లేఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఇతర జట్లతో పోటీపడాల్సి ఉంటుంది. ఒక్కటి గెలిచినా.. ముంబయికి అవకాశం ఉంటుంది.

లఖ్‌నవూ(Lucknow Super Giants) : ప్రస్తుతం పాయింట్లు 13.. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు రెండు (ముంబయి, కోల్‌కతాతో)

ఈ రెండింటిలో లఖ్‌నవూ ఓడిపోతే.. ప్లేఆఫ్స్‌ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. లఖ్‌నవూ ఒక్క మ్యాచ్‌లో  గెలిచినా.. ఆర్‌ఆర్‌,  కేకేఆర్‌లు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి వైదొలుగుతాయి. ఒకవేళ చెన్నై, ముంబయి చివరి మ్యాచ్‌ల్లో ఓడి.. లఖ్‌నవూ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. 17 పాయింట్లతో టాప్‌ 2లో నిలిచే అవకాశం ఉంటుంది.

బెంగళూరు(Royal Challengers Bangalore) : ప్రస్తుతం పాయింట్లు 12 .. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు రెండు (సన్‌రైజర్స్‌, గుజరాత్‌లతో)

ఆర్సీబీ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ రేసులో నిలుస్తుంది. ఒక్క మ్యాచ్‌లోనే గెలిస్తే.. 14 పాయింట్లతో ఇతర జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది.

12 పాయింట్లతో ఉన్న పంజాబ్‌(Punjab Kings) తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు తనకు కలిసి రావాలి. ఇక పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న హైదరాబాద్‌, దిల్లీ.. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగాయి. రాజస్థాన్‌, కోల్‌కతా ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఒక వేళ వీటిల్లో గెలిచినా.. ఇతర జట్ల అవకాశాలను ప్రభావితం చేస్తాయే తప్ప.. ప్లేఆఫ్స్‌లో చేరడం దాదాపు కష్టమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని