Bridge Game: బ్రిడ్జ్‌లో పతకాలు.. ఈ ఆట గురించి తెలుసా?

ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో (Asian Games) బ్రిడ్జ్‌ (జూదం) ఆడి పతకాలు గెలవొచ్చని చాలా మందికి తెలియదు. ఈ అంతర్జాతీయ పోటీల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించొచ్చు. మనవాళ్లు భారత్‌ తరపున బరిలో దిగడమే కాదు ఏకంగా రజతం సాధించారు. మరి ఆసియా క్రీడల్లో ఈ బ్రిడ్జ్ గోల ఏమిటో? తెలుసుకుందామా?

Published : 09 Oct 2023 21:06 IST

ఓ టేబుల్‌.. చుట్టూ నలుగురు వ్యక్తులు.. మధ్యలో పేక ముక్కలు.. అందరూ సీరియస్‌గా ఆటలో మునిగిపోయారు. విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గెలిచిన తర్వాత విజయనాదాలు చేశారు. వీళ్లు గెలవాలని కోరుకునే అభిమానులు.. ఆటను పర్యవేక్షించే ప్రతినిధులు. అదేంటీ.. బ్రిడ్జ్‌ (జూదం) ఆడటమే తప్పు.. ఇది వ్యసనంగా మారి ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. చట్ట విరుద్ధంగా ఆడే వాళ్లను పోలీసులకు అప్పజెప్పాల్సింది పోయి ప్రోత్సహించడమేమిటీ? అనుకుంటున్నారా? అయితే ఇది ఆస్తులు పొగొట్టుకుని కుటుంబాలను నడిరోడ్డుమీదకు లాగేసే ఆట కాదు. ప్రపంచ వేదికపై పతకాలు అందించే గేమ్‌. అవును.. ఆసియా క్రీడల్లో (Asian Games 2022) బ్రిడ్జ్‌ (Bridge)గా నిర్వహించిన ఈ ఆటలో పతకాలతో దేశానికి ఖ్యాతి తెచ్చేందుకు అథ్లెట్లు తలపడ్డారు. బ్రిడ్జ్‌లో రజతం (Silver Medel)తో మన పురుషుల జట్టు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. మరి ఆసియా క్రీడల్లో ఈ బ్రిడ్జ్‌ గోల ఏంటో? తెలుసుకుందామా? 

శతాబ్దాల చరిత్ర..

ఈ ఆటకు శతాబ్దాల చరిత్ర ఉంది. 16వ శతకంలో ఇంగ్లాండ్‌లో ఆడినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అయితే అధికారికంగా బ్రిడ్జ్‌ కోసం ఓ సంఘాన్ని 90 ఏళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. 1932లోనే అంతర్జాతీయ బ్రిడ్జ్‌ లీగ్‌కు అంకురార్పణ జరిగింది. 1958లో ఇది ప్రపంచ బ్రిడ్జ్‌ సమాఖ్యగా మారింది. అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించడం, ఆటకు ఆదరణ పెంచే చర్యలు చేపట్టడం దీని విధి. 2018లో ఆసియా క్రీడల్లో బ్రిడ్జ్‌ అడుగుపెట్టింది. అప్పుడు పురుషుల పెయిర్, టీమ్, మహిళల పెయిర్, టీమ్, మిక్స్‌డ్‌ పెయిర్, టీమ్, సూపర్‌మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పురుషుల పెయిర్‌లో స్వర్ణం, పురుషుల టీమ్, మిక్స్‌డ్‌ టీమ్‌లో కాంస్యాలు భారత్‌కు దక్కాయి. అప్పుడు 14 దేశాల నుంచి 213 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. చైనా మూడు స్వర్ణాలు సహా 6 పతకాలు గెలిచింది. ఈ సారి పురుషుల, మహిళల టీమ్, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లో మాత్రమే పోటీలు జరిగాయి. పురుషుల టీమ్‌లో భారత్‌ రజతం గెలిచింది. ఈ సారి 12 దేశాల నుంచి 171 మంది అథ్లెట్లు బ్రిడ్జ్‌లో పోటీపడ్డారు. 

వేర్వేరు రంగాల నుంచి..

ఆసియా క్రీడల బ్రిడ్జ్‌లో పాల్గొన్న అథ్లెట్లలో చాలా మంది వేర్వేరు రంగాలకు చెందిన వాళ్లే. కంపెనీలకు సీఈవోలుగా ఉన్నవాళ్లు, ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, వ్యాపార వేత్తలు, ఇతర ప్రొఫెషనల్‌ రంగాల నుంచి కూడా ఈ క్రీడల్లో పోటీపడ్డారు. సరదాగా ఆడే బ్రిడ్జ్‌లో పట్టు సాధించిన వాళ్లను ఆయా దేశాలు సెలక్షన్స్‌ నిర్వహించి మరీ ఆసియా క్రీడలకు పంపాయి.  సాధారణంగా క్రీడల్లో యువకులు, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నవాళ్లు సత్తాచాటడం చూస్తుంటాం. కానీ బ్రిడ్జ్‌లో మాత్రం అనుభవమే ప్రధాన ఆయుధం. వయసు మీద పడ్డప్పటికీ బ్రిడ్జ్‌లో చేయి తిరిగి ఉంటే పతకాలు సాధించవచ్చు. 70 ఏళ్లకు పై బడ్డ ఆటగాళ్లు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. 78 ఏళ్ల మసూద్‌ మజార్‌ అత్యంత పెద్ద వయస్కుడు. 2018 క్రీడల్లో 89 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా పాల్గొన్నాడు. మహిళల విభాగంలోనూ పోటీలున్నాయి. దీనికి రిటైర్మెంట్‌ వయసు అనేది ఉండదు. పిన్న వయస్సు ప్లేయర్‌ అంటే భారత్‌కు చెందిన 22 ఏళ్ల విద్య పటేల్‌. చెస్‌ లాగే ఇది కూడా మైండ్‌ స్పోర్ట్‌. ఇది లాజికల్‌ పవర్‌ను పెంచుతుందని చెబుతుంటారు. మెదడు నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. అందుకే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ దీన్ని గుర్తించింది. కానీ ఇంకా ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టలేదు. త్వరలోనే ఇది ఒలింపిక్‌ క్రీడగానూ మారే అవకాశాలున్నాయి. 

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని