IND vs ENG: ఇంగ్లాండ్‌పై విక్టరీ మరెంతో ‘స్పెషల్‌’.. స్టంప్స్‌నే టార్గెట్‌ చేస్తూ..!

స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్ (IND vs ENG) వరల్డ్‌ కప్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. గత టీ20 ప్రపంచ కప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఈ విజయాన్ని మరెంతో స్పెషల్‌ విక్టరీగా మార్చుకుంది.

Updated : 31 Oct 2023 10:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్‌ హవా కొనసాగుతోంది. డబుల్ హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతోంది. తొలుత బ్యాటింగ్‌ విభాగానికి ఎదురైన పరీక్షలో సఫలీకృతం కావడం.. ఇప్పుడు బౌలింగ్‌లోనూ అత్యుత్తమంగా రాణించడం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఒక్కో సవాల్‌ను అధిగమిస్తూ కప్‌ సాధించే దిశగా పయనం సాగుతోంది. అయితే, ఈ ఆరు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌తో మ్యాచే భారత్‌కు ఎంతో ప్రత్యేకం.. టీమ్‌ఇండియా బౌలర్ల లక్ష్యం నేరుగా స్టంప్స్‌పైనే ఉండటం విశేషం.

ఇంగ్లాండ్‌పై ఆషామాషీగా వచ్చిన గెలుపు కాదు ఇది.. టీమ్‌ఇండియా బౌలింగ్‌ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన మ్యాచ్‌. భారత్ జట్టు గెలిచింది కాబట్టి ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ ‘స్పెషల్‌’ అంటున్నారేమో అనుకోవద్దు. ఎందుకంటే ఇంగ్లాండ్‌ జట్టులోని హేమాహేమీ బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చడం సులువైన విషయం కాదు. దానికి ఎంతో నిబద్ధత, బౌలింగ్‌లో క్రమశిక్షణ అవసరం. అదేంటనేది భారత్‌ ఆడిన గత ఐదు మ్యాచులను.. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను పోల్చుకుంటే  అర్థమైపోతుంది. ఆ ఐదింట్లో మొదట భారత్‌ బౌలింగ్‌ చేసింది. పిచ్‌, వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని ఆయా మ్యాచుల్లో ప్రత్యర్థులను కట్టడి చేసింది. ఆనక బ్యాటర్లు చెలరేగి విజయాలను అందించారు.

కానీ, ఇంగ్లాండ్‌తో మాత్రం ఛేదన సమయంలో బౌలింగ్‌ చేయాల్సిన పరిస్థితి. అది కూడా తేమ ప్రభావం అధికంగా ఉండే లఖ్‌నవూ పిచ్‌పై కావడం గమనార్హం. సరే, ఇంగ్లాండ్‌కు నిర్దేశించిన లక్ష్యం భారీగా ఉందంటే.. అలా కూడా లేదు. టార్గెట్‌ 230 పరుగులు మాత్రమే.. అప్పటికే వరుసగా ఓటములను ఎదుర్కొన్న ఇంగ్లాండ్‌ చెలరేగిపోతుందని అంతా భావించారు. ఆ జట్టులోనూ హేమాహేమీ బ్యాటర్లు ఉన్నారు. బంతిపై పట్టు లభిస్తుందా..? లేదా? అనే అనుమానాలు. కానీ, భారత బౌలింగ్‌ విభాగం ‘లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు’ కట్టుబడి మరీ బంతిని సంధించడంతో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఏమాత్రం ప్రతిఘటించలేకపోయారు. దీంతో 129 పరుగులకే కుప్పకూలడం విశేషం. ఇక గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ను.. ఇంగ్లాండ్‌ పది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆ ఓటమికి ఇప్పుడు టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.

బౌల్డ్‌లే ఎక్కువ..

భారత బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు ఇంగ్లాండ్‌ బ్యాటర్ల వద్ద సమాధానం కూడా లేదు. తొలుత బుమ్రా బెంబేలెత్తించగా.. షమీ వచ్చాక ఇంగ్లాండ్‌ పతనం వేగంగా సాగింది. అతడి బౌలింగ్‌ను ఆడేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఆరుగురు బ్యాటర్లు బౌల్డ్‌ కావడం, ఇద్దరు ఎల్బీ, ఒక క్యాచ్‌, ఒక స్టంపౌట్‌ అయ్యారంటే భారత బౌలింగ్‌ పదును ఎంత అద్భుతంగా ఉందో అర్థమైపోతుంది. స్టంప్స్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌ దాడి చేశారు. మొత్తం 10 వికెట్లలో ఏడు పేసర్లు తీయగా.. మూడు స్పిన్నర్లకు దక్కాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ స్పెల్‌లో మార్పులు చేయడం కూడా భారత్‌కు కలిసొచ్చింది. షమీ, బుమ్రా, కుల్‌దీప్‌, జడేజా కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టారు. మరీ ముఖ్యంగా షమీ వేసిన బంతిని అంచనా వేయడంలో బెన్‌ స్టోక్స్‌ ఘోరంగా విఫలమై క్లీన్‌బౌల్డ్‌ కావడం గమనార్హం. అలాగే డేవిడ్‌ మలన్‌ను బుమ్రా బౌల్డ్‌ చేసిన తీరు అభినందనీయం. అయితే, వన్డే ప్రపంచకప్‌లోనే అత్యంత అద్భుతమైన డెలివరీ సంధించిన బౌలర్‌గా మాత్రం కుల్‌దీప్‌ నిలిచిపోతాడు. ఆఫ్ వికెట్‌కు ఆవల వేసిన బంతి అద్భుతమైన టర్నింగ్‌తో వికెట్లను గిరాటేయడంతో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ అలానే చూస్తుండిపోయాడు. 2019 వరల్డ్‌ కప్‌లో బాబర్‌ అజామ్‌ను ఇలానే సూపర్‌ డెలివరీతో కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేసిన సంఘటనను ఇది గుర్తుకు తెచ్చింది.

బలమైన బౌలింగ్‌ మనదే..

వన్డే ప్రపంచ కప్‌ టోర్నీ ప్రారంభానికి ముందు స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని అంతా భావించారు. దీంతో ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కూర్పుతోనే బరిలోకి దిగితే మంచిదనే సూచనలు వచ్చాయి. కానీ, పేసర్లు కూడా తామేం తక్కువ కాదంటూ సత్తా చాటారు. పవర్‌ప్లేలో అద్భుతమైన బౌలర్‌గా అనిపించుకున్న సిరాజ్‌ ఈసారి మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదు. మిడిల్‌ ఓవర్లలో మాత్రం వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలిచాడు. దీంతో జస్ప్రీత్ బుమ్రా మొత్తం బాధ్యత తనపై వేసుకున్నాడు. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. పాక్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి జట్లపైనా బుమ్రా శుభారంభం అందిస్తే మిగతా బౌలర్లు చెలరేగిపోయారు. ఎప్పుడైతే షమీ కూడా జట్టుతో చేరాడో పేస్‌ విభాగం మరింత పదునెక్కింది. ఈ వరల్డ్‌ కప్‌లో తొలిసారి కివీస్‌పై ఆడిన షమీ ఐదు వికెట్ల ప్రదర్శన చేసి అబ్బురపరిచాడు. ఇక ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ ప్రతి బంతికీ వికెట్‌ తీసేలా అనిపించింది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి వికెట్లనే లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌ చేశాడు. తర్వాతి మ్యాచుల్లో హార్దిక్‌ వచ్చినా షమీని పక్కన పెట్టడం మాత్రం అసాధ్యం. అవసరమైతే సిరాజ్‌ స్థానంలో హార్దిక్‌ను ఆడిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.

వన్డే ప్రపంచకప్‌ను (ODI World Cup 2023) నెగ్గాలంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలి. ప్రస్తుతం భారత బౌలింగ్‌ విభాగాన్ని చూస్తుంటే మిగతా జట్ల కంటే పటిష్ఠంగానే ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లతోపాటు నాకౌట్‌ దశలో ఏమాత్రం పట్టువిడవకుండా తలపడాలి. ఇదే నిలకడైన ఆటతీరును చివరి వరకూ కొనసాగించి విజేతగా నిలవాలనేది అభిమానుల ఆకాంక్ష.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు