Hasaranga: హసరంగాపై ఐసీసీ వేటు.. రెండు మ్యాచ్‌లకు దూరంగా కానున్న శ్రీలంక కెప్టెన్‌

శ్రీలంక టీ20 కెప్టెన్‌ హసరంగా పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది.

Published : 25 Feb 2024 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంక టీ20 కెప్టెన్‌ వనిందు హసరంగా (Wanindu Hasaranga)పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. అఫ్గనిస్థాన్‌తో జరిగిన చివరి టీ20లో అంపైర్‌ లిండన్‌ హన్నిబల్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.‘‘ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి అంపైర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోతతో పాటు రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని హసరంగాపై విధిస్తున్నాం’’ అని ప్రకటన విడుదల చేసింది. దీంతో వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న మొదటి రెండు టీ20 మ్యాచ్‌లకు హసరంగా దూరం కానున్నాడు.
అసలు ఎం జరిగిందంటే..
అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో శ్రీలంకకు 3 బంతుల్లో 11 పరుగులు కావాలి. ఈ సమయంలో అఫ్గాన్‌ బౌలర్‌ వఫాదర్‌ వేసిన బంతి బ్యాటర్‌ కమిందు మెండిస్‌ నడుము కంటే ఎత్తులో వెళ్లింది. లెగ్‌ అంపైర్‌గా ఉన్న హన్నిబల్‌ దాన్ని నోబాల్‌గా ప్రకటించలేదు. ఈ మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. మ్యాచ్‌ అనంతరం హసరంగా మాట్లాడుతూ బంతి బ్యాటర్‌ నడుముకంటే ఎత్తుగా వెళ్లింది. అంపైర్‌ దాన్ని గమనించలేకపోతే అతడు క్రికెట్‌కు పనికిరాడు. వేరే పని చూసుకోవడం మంచిది. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. 
మరోవైపు ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ బ్యాటర్‌ రెహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) పై కూడా వేటు పడింది. అంపైర్‌ సూచనలు పాటించకుండా ఫీల్డ్‌లో పదే పదే బ్యాట్ గ్రిప్‌ మార్చుకోవడంతో అతని మ్యాచ్‌ ఫీజు నుంచి 15 శాతాన్ని ఐసీసీ కోత విధించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని