Womens World Cup: ప్రపంచకప్‌ మనదే.. చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు

Eenadu icon
By Sports News Team Updated : 03 Nov 2025 02:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ముంబయి: భారత మహిళల క్రికెట్‌లో సువర్ణాధ్యాయం లిఖితమైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. తొలిసారి టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ (Womens World Cup)ను ఒడిసిపట్టుకుంది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు, టీవీ, మొబైల్‌ తెరలకు అతుక్కుపోయిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్లతరబడి ఎదురుచూసిన భారతావని ఒక్కసారిగా పులకించిపోయింది. 

సెమీస్‌లో సూపర్‌ విక్టరీతో ఫైనల్‌లో అడుగుపెట్టిన భారత్‌.. ఫైనల్‌లోనూ మరుపురాని ప్రదర్శన చేసింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (87; 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58; 58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), స్మృతి మంధాన (45; 58 బంతుల్లో 8 ఫోర్లు) రాణించడంతో దక్షిణాఫ్రికాకు భారత్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు పరిమితం అయింది. కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ (101: 98 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌) ఒంటరి పోరాటం చేసింది. అనెరి డెర్క్‌సెన్‌ (35), తజ్మిన్‌ బ్రిట్స్‌ (23), సునె లూస్‌ (25) పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5, షెఫాలీ వర్మ 2, శ్రీ చరణి ఒక్కో వికెట్‌ తీశారు. ఫైనల్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి రెండు కీలక వికెట్లు తీసిన షెఫాలీ వర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ దిమ్యాచ్‌ అవార్డు వచ్చింది. ఇక టోర్నీలో అత్యధికంగా 22 వికెట్లు తీసిన దీప్తిశర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ వచ్చింది.  

వోల్వార్ట్‌ ఒంటిరి పోరు.. చెలరేగిన దీప్తి శర్మ, షెఫాలీ..

భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు తొలి వికెట్‌కు 51 పరుగులు చేసింది. తజ్మిన్‌తో కలిసి కెప్టెన్‌ లారా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే 9.3 ఓవర్ల వద్ద పరుగు తీసే క్రమంలో అమన్‌జోత్‌ కౌర్‌ అద్భుతమైన త్రోతో తజ్మిన్‌ రనౌట్‌గా వెనుదిరిగింది. అనంతరం వచ్చిన అన్నెకె బోష్‌ను శ్రీ చరణి బోల్తా కొట్టించింది. 62 పరుగుల వద్ద ఎల్బీగా వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. దక్షిణాఫ్రికా స్వల్ప తేడాతో రెండు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడిలోకి వెళ్లింది. అయితే సునె లూస్‌తో జట్టు కట్టిన వోల్వార్ట్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ క్రమంలో 114 పరుగుల వద్ద షెఫాలీ బౌలింగ్‌లో సునె (25: 31 బంతుల్లో 4 ఫోర్లు) ఔటైయింది. అనంతరం మారిజానె కాప్‌ (4)ను సైతం షెఫాలీ వర్మ పెవిలియన్‌కు చేర్చింది. దీంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత వచ్చిన సినాలో జఫ్తా (16) దీప్తి బౌలింగ్‌లో ఔటైంది. దీంతో ఆ జట్టు 148 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలోకి జారుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అన్నెరి (35: 37 ఒక ఫోర్‌, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. లారా, అన్నెరి కలిసి ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 39.3 ఓవర్ల వద్ద దీప్తి బౌలింగ్‌లో అన్నెరి బౌల్డ్‌ అయింది. మరోవైపు ఒంటిరి పోరాటం చేస్తున్న కెప్టెన్‌ లారా 96 బంతుల్లో శతకం చేసింది. అనంతరం దీప్తి బౌలింగ్‌లో వోల్వార్ట్‌ భారీ షాట్‌ కొట్టగా తీవ్ర ఒత్తిడిలో అమన్‌జోత్‌ కౌర్‌ అద్భుతంగా క్యాచ్‌ను అందుకుంది. దీంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖరారైంది. అనంతరం మరో 26 పరుగులు చేసి సౌతాఫ్రికా చివరి మూడు వికెట్లు కోల్పోయి 246 పరుగులకు ఆలౌటైంది.   

షెఫాలీ, దీప్తి దూకుడు..

ఓపెనర్లు మంధాన, షెఫాలీ ఆరంభం నుంచి నిలకడగా ఆడి భారత్‌కు శుభారంభం అందించారు. హాఫ్‌ సెంచరీ ముంగిట స్మృతి ఔటైంది. దీంతో తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్‌లో షెఫాలీ అర్ధ శతకం (49 బంతుల్లో) అందుకుంది. తర్వాత జెమీమాతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది షెఫాలీ. సెంచరీ దిశగా సాగుతున్న ఆమెను అయబొంగా వెనక్కి పంపింది. కాసేపటికే జెమీమా కూడా పెవిలియన్ చేరింది. ఈ దశలో దీప్తి, హర్మన్‌ప్రీత్ కౌర్ నాలుగో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం అందించారు. మ్లాబా బౌలింగ్‌లో కౌర్ క్లీన్‌బౌల్డ్ అయింది. అమన్‌జ్యోత్‌ను డి క్లెర్క్‌ ఔట్ చేసింది. దూకుడుగా ఆడిన రిచా ఘోష్‌ అయబొంగా వేసిన 49 ఓవర్‌లో ఔట్‌ కాగా.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి దీప్తి రనౌటైంది. రిచా ఘోష్ (34; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ (24), హర్మన్‌ప్రీత్ కౌర్ (20), అమన్‌జ్యోత్ కౌర్ (12) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా 3, మ్లాబా, క్లో ట్రయాన్, నడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ తీశారు.


Tags :
Published : 03 Nov 2025 00:03 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు