WI vs IND: ‘విండీస్‌’ నేర్పిన పాఠాలు ఇవే.. మరి నేర్చుకుంటారా..?

దాదాపు నెలరోజులపాటు వెస్టిండీస్‌ పర్యటనలో భారత్‌ (WI vs IND) గడిపేసింది. కొన్నింట్లో సానుకూల ఫలితాలు రాగా.. మరికొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సిన పరిస్థితులు కూడా తెలుసుకునేందుకు ఉపయోగపడింది. టెస్టు, వన్డే సిరీస్‌లను భారత్‌ గెలిచినప్పటికీ.. విండీస్‌ బలహీనంగా ఉండటంతో పెద్దగా పోటీ ఇవ్వలేకపోయిందనే అభిప్రాయం ఉంది. టీ20ల్లో వారి ఆటతీరుతో పుంజుకొని విండీస్‌ ఆటగాళ్లు సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. 

Updated : 14 Aug 2023 14:07 IST

వన్డే ప్రపంచ కప్‌ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.. ఇంటా, బయటా విమర్శలు.. టెస్టుల్లో కొత్తవారే ఎక్కువ. వన్డేల్లోనూ అంతంతమాత్రమే. గతేడాది పొట్టి ప్రపంచ కప్‌లోనూ ఆడలేకపోయిన చరిత్ర.. సీనియర్లు జాతీయ జట్టు కంటే లీగ్‌ క్రికెట్‌కే ప్రాధాన్యత ఇస్తుండటంతో తమ దేశ క్రికెట్‌ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనలో మాజీ క్రికెటర్లు.. ఇలాంటి పరిస్థితుల్లో వెస్టిండీస్‌ పర్యటనకు టీమ్‌ఇండియా వెళ్లింది. అయితే విజయంతో ఆరంభించి ఓటమితో ముగించిన ఈ పర్యటనలో భారత్ ఎక్కడ విజయవంతమైంది..? ఎక్కడ విఫలమైంది...? ఎలాంటి అంశాల్లో మెరుగవ్వాలి..?

రెండో బంతికే కెరీర్‌లో తొలి వికెట్‌.. తిలక్‌ కొత్త బాధ్యతలు సక్సెస్!

రోహిత్ నాయకత్వంలో విండీస్‌లో అడుగు పెట్టిన భారత్ తొలుత రెండు టెస్టుల సిరీస్‌లో తలపడింది. మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్‌.. రెండో టెస్టులోనూ గెలిచేలా ఉన్నప్పటికీ వర్షం కారణంగా డ్రాగా ముగించాల్సిన పరిస్థితి. దీంతో రెండుటెస్టుల సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుని యువకులతో కూడిన జట్టునే వన్డేల్లో ఆడించింది. కాస్త తప్పటడుగు పడినట్లు అనిపించినా ఆ సిరీస్‌నూ సొంతం చేసుకుంది. ఇక టీ20 సిరీస్‌లో డేంజరస్‌ బ్యాటర్లతో బరిలోకి దిగిన విండీస్‌ను తట్టుకోవడం భారత్‌కు ఇబ్బందిగా మారింది. దీంతో పొట్టి సిరీస్‌ను సమర్పించుకోవాల్సి వచ్చింది. పూరన్, రోవ్‌మన్ పావెల్, బ్రాండన్ కింగ్‌, షైహోప్‌ వంటి హిట్టర్లను అడ్డుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో అదరగొట్టే పూరన్ ఈసారి మరింత రెచ్చిపోయాడు. ఒక సిరీస్‌ పోయినప్పటికీ ఈ పర్యటనలో చాలా అంశాలు భారత్‌కు కలిసొచ్చాయి. అలాగే మరికొన్ని సమస్యలూ బయటకొచ్చాయి. వచ్చే ఏడాది ఇక్కడే టీ20 ప్రపంచ కప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటప్పుడు మంచి సన్నాహకంగా మార్చుకోవాల్సిన సమయంలో సిరీస్‌ను కోల్పోవడం అభిమానుల మదిలో సందేహాలు లేవనెత్తనున్నాయి.

యువకులు అదుర్స్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2023 తర్వాత ఆసియా కప్‌ 2023 మినీ టోర్నీకి ముందు భారత్‌ చేసిన పర్యటన ఇదే. దాదాపు నెల రోజులపాటు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను భారత్‌ ఆడింది. విండీస్‌ పర్యటనతోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, ముకేశ్‌ కుమార్‌, తిలక్‌ వర్మ తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. జైస్వాల్ తొలి టెస్టులోనే భారీ శతకం బాదేశాడు. టీ20ల్లోనూ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టి విండీస్‌పై టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం విశేషం. తన తొలి హాఫ్ సెంచరీతోపాటు బౌలింగ్‌లోనూ మొదటి వికెట్ పడగొట్టాడు. ఇక ముకేశ్‌ కుమార్ ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించడం విశేషం. టెస్టు, వన్డేలు, టీ20ల్లో వికెట్లు తీశాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ను కాదని ముకేశ్‌కే అవకాశాలు దక్కాయంటే అతడి బౌలింగ్‌ ప్రదర్శన బాగుండటమే కారణం. వన్డేల్లో బ్యాటర్లు ఇషాన్‌ కిషన్ (184 పరుగులు), శుభ్‌మన్‌ గిల్ (126 పరుగులు) రాణించారు. ఫామ్‌తో ఇబ్బంది పడిన సూర్యకుమార్‌ యాదవ్‌ (166 పరుగులు) ఎట్టకేలకు టీ20ల్లో తన సత్తా చూపించాడు. 

వీరు విఫలమే! 

ఓ వైపు యువ క్రికెటర్లు అదరగొట్టేస్తుండగా.. కొందరు సీనియర్లు మాత్రం తమకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేదు. ఈ జాబితాలో ముందు వరుసలో సంజూ శాంసన్‌ ఉంటాడు. వన్డేలు, టీ20ల్లో తన స్థాయి ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. ఒక్క వన్డేలో మినహా మిగతా అన్ని మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. ఆ వన్డేలోనూ 41 బంతుల్లో 51 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఐదు టీ20ల్లో శాంసన్‌ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. హార్దిక్‌ పాండ్య కూడా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఏమంత గొప్ప ప్రదర్శన ఇవ్వలేదు. వన్డేల్లో హార్దిక్‌ మూడు మ్యాచుల్లో 82 పరుగులు చేసి ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఐదు టీ20ల్లో  పాండ్య 77 పరుగులు చేసి నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. వన్డే ప్రపంచకప్‌లో కీలకంగా మారతాడని భావిస్తున్న తరుణంలో అతడి ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అదరగొట్టి టెస్టు వైస్‌ కెప్టెన్‌గా మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అజింక్య రహానె విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమై నిరాశపరిచాడు. అతడు ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో 3, 8 పరుగులు మాత్రమే సాధించాడు.

హార్దిక్‌ కెప్టెన్సీపై విమర్శలు..

వెస్టిండీస్ పర్యటనను భారత్ ప్రయోగాలకు వేదికగా మార్చకుంది. టెస్టు సిరీస్‌తోపాటు తొలి వన్డేకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించగా.. ఆ తర్వాత నుంచి అతడితోపాటు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చింది. విండీస్‌తో రెండు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌కు హార్దిక్‌ పాండ్య నాయకత్వం వహించాడు. అయితే, అతడు బౌలర్లను వినియోగించుకున్న తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఫామ్‌లో ఉండి వికెట్లు తీస్తున్న బౌలర్లతో పూర్తి ఓవర్ల కోటా వేయించకపోవడం, బాగా పరుగులు సమర్పిస్తున్న సమయంలో బౌలింగ్‌ చేయించడం వంటి నిర్ణయాలతోపాటు నాలుగో టీ20 సందర్భంగా యువ బ్యాటర్ తిలక్ వర్మ (49*) హాఫ్‌ సెంచరీకి సమీపంలో ఉన్నప్పుడు సిక్స్‌తో పాండ్య మ్యాచ్‌ను ముగించాడు. సీనియర్‌గా, కెప్టెన్‌గా సహచరులకు మార్గదర్శకంగా ఉండాల్సిందిపోయి విమర్శలకు గురయ్యాడు. మూడు, నాలుగో టీ20ల్లోనూ చాహల్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. అయితే, అతడికి మూడు ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. చివరిదైన ఐదో టీ20లో చాహల్‌ బౌలింగ్‌లో భారీగా పరుగులు వస్తున్న క్రమంలో అతడితోనూ నాలుగు ఓవర్లు వేయించాడు. పవర్‌ప్లే ఓవర్లలో అక్షర్ పటేల్ వికెట్లు తీయగలడు. కానీ, అతడినీ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకూ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతున్న వేళ.. ఇలాంటి నిర్ణయాలతో వెనుకబడే అవకాశం లేకపోలేదు. 

ద్రవిడ్ చెప్పినట్లుగా.. 

విండీస్‌తో టీ20 సిరీస్‌ ముగిశాక.. బ్యాటింగ్‌ విభాగంపై మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని భారత కోచ్‌ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. అతడు చెప్పినట్లుగా బ్యాటింగ్‌ పటిష్ఠంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందే. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసినా ఫర్లేదు కానీ.. ఎనిమిదో నంబర్‌ వరకు పరుగులు సాధించే బ్యాటర్లు జట్టులో ఉండటం కీలకం. ఆల్‌రౌండర్ల ఆవశ్యకతను రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పకనే చెప్పాడు. కుల్‌దీప్‌ యాదవ్, చాహల్‌ స్పెషలిస్ట్‌ స్పిన్నర్లే కానీ రవీంద్ర జడేజాలా బ్యాటింగ్‌ చేయలేరు. అక్షర్‌ పటేల్ ఉన్నన్నప్పటికీ అతడు ఏడో స్థానంలో ఆడాడు. ఆ తర్వాత కనీసం బ్యాట్‌ను ఝుళిపించడం కూడా రానివారే. ఈ పర్యటనలో భారత్‌ నేర్చుకోవాల్సిన అంశాల్లో లోతైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను సిద్ధం చేసుకోవడంతోపాటు మరింతమంది యువకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా రిజర్వ్‌ బెంచ్‌నూ బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టాలి.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని