WPL: ముంబయి ఇండియన్స్‌ జైత్రయాత్ర.. యూపీపై 8 వికెట్ల తేడాతో విజయం

డబ్ల్యూపీఎల్‌ (WPL)లో ముంబయి ఇండియన్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబయి..  ఆదివారం యూపీ వారియర్స్‌ని ఓడించి నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Updated : 12 Mar 2023 23:17 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌ (WPL)లో ముంబయి ఇండియన్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబయి..  ఆదివారం యూపీ వారియర్స్‌ని ఓడించి నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబయి 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్ (53; 33 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకంతో మెరవగా.. నాట్‌ సీవర్‌ (45 నాటౌట్‌; 31 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌),  ఓపెనర్‌ యాస్తిక భాటియా (42; 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, సోఫీ ఎకిల్ స్టోన్‌ తలో వికెట్‌ పడగొట్టింది. 

మొదట బ్యాటింగ్‌ చేసిన యూపీ బ్యాటర్లలో కెప్టెన్‌ అలీసా హీలే (58; 46 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), తాహిలా మెక్‌గ్రాత్‌ (50; 37 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించారు. దేవికా వైద్య (6), ఎకిల్ స్టోన్‌ (1), దీప్తి శర్మ (7) విఫలమవ్వగా.. కిరణ్ నవ్‌గిరె (17; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. శ్వేత (2), సిమ్రాన్‌ (9) నాటౌట్‌గా నిలిచారు.  ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. అమేలియా కెర్‌ రెండు, హేలీ మాథ్యూస్‌ ఒక వికెట్‌ చొప్పున తీశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని