WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్‌

డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final) మ్యాచ్‌ కోసం సర్వత్రా ఎదురు చూస్తున్నారు. టీ20ల రుచి చూసిన అభిమానుల కోసం టెస్టు మజా అందించడానికి సిద్ధమవుతోంది.

Published : 05 Jun 2023 01:13 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ముగిశాక.. టీమ్ఇండియా ఆడబోయే తొలి టెస్టు మ్యాచ్‌. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో (WTC Final) ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా జూన్ 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే, పేస్‌ పిచ్‌పై ఆసీస్‌ బౌలింగ్‌ను టీమ్‌ఇండియా ఎలా ఎదుర్కొంటుందోననే సందేహం భారత క్రికెట్‌ అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలో రోహిత్‌ సేన గెలవాలంటే ఏం చేయాలనే దానిపై టీమ్‌ఇండియా మాజీ చీఫ్‌ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక సూచనలు చేశాడు. వీలైనంత త్వరగా టీ20 ఫార్మాట్‌ నుంచి రోహిత్ టెస్టు క్రికెట్‌కు మారిపోవాలని చెప్పాడు. రోహిత్ ఫామ్‌పై పెద్దగా ఆందోళన అవసరం లేదని  స్పష్టం చేశాడు. 

‘‘రోహిత్ శర్మ నేరుగా టీ20 క్రికెట్‌ ఆడి ఇంగ్లాండ్‌కు వచ్చాడు. ఇప్పుడు అదే సమస్యగా మారనుంది. ఎందుకంటే రోహిత్ ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదు. కనీసం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఓ వార్మప్ మ్యాచ్‌ను ఏర్పాటు చేస్తే బాగుండేది. ఇదొక భారీ మ్యాచ్‌. ద్వైపాక్షిక సిరీస్‌ మాదిరిగా ఇక్కడ రెండో అవకాశం ఉండదని గుర్తు పెట్టుకోండి. అందుకే, సరైన సన్నద్ధత చాలా అవసరం. ఇక వికెట్ కీపర్‌ విషయానికొస్తే.. కేఎస్ భరత్‌ స్పెషలిస్ట్ కీపర్‌. కాబట్టి, అతడే ఆడాలి’’ అని మాజీ చీఫ్‌ సెలెక్టర్ వివరించాడు. 

తుది జట్టు ఇలా.. : హర్భజన్‌

టీమ్‌ఇండియా తుది జట్టుపై మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ , మహమ్మద్ కైఫ్‌ తమ విశ్లేషణ తెలియజేశారు. ‘‘భారత తుది జట్టులో ఇషాన్‌ కిషన్‌ ఆడే అవకాశాలు చాలా  తక్కువ. కేఎస్ భరత్‌ వికెట్ కీపర్‌గా వస్తాడు. గత కొన్ని రోజులుగా నిలకడైన ఆటతీరును ప్రద్శిస్తున్నాడు. ఒక వేళ వృద్ధిమాన్‌ సాహా జట్టులో ఉంటే.. అతడికే ప్రాధాన్యం ఇచ్చేవాడిని. అనుభవం రీత్యా సాహా వైపు మొగ్గు చూపుతా. అదేవిధంగా కేఎల్ రాహుల్‌ ఉన్నాసరే ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కీపింగ్‌ కూడా చేయగలడు. పిచ్‌ మీద గ్రాస్‌ కాస్త తక్కువగానే ఉంది. ఎండ బాగుండటం వల్ల ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఉత్తమం. అలా కుదరకపోతే ముగ్గురు సీమర్లతోపాటు రవీంద్రజడేజాను ఆడించాలి. వారితోపాటు శార్దూల్ ఠాకూర్‌ కూడా జట్టులో ఉండాలి. అప్పుడు బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌ కూడా పటిష్ఠంగా ఉంటుంది’’ అని హర్భజన్‌ సింగ్‌ తెలిపాడు. 

ఇషాన్‌ ఉంటే బెటర్‌: కైఫ్‌

‘‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం ఓపెనర్లుగా గిల్‌ - రోహిత్ శర్మ ఆడాలి. ఆ తర్వాత పుజారా, విరాట్ కోహ్లీ, రహానె ఉండనే ఉంటారు. ఇక ఆరో స్థానంలో మాత్రం ఇషాన్‌ కిషన్‌ ఆడాల్సిందే. ఎందుకంటే దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. గతంలో రిషభ్‌ పంత్ కూడా ఇదే పాత్ర పోషించాడు. ఇక, ఏడో స్థానంలో జడేజా.. 8వ స్థానంలో శార్దూల్‌ లేదా అశ్విన్‌ ఆడాలి. ఆసీస్‌ బ్యాటర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్‌ హెడ్, ఖవాజాను అడ్డుకోవడంలో అశ్విన్‌ కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నా. పేసర్లు షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్ తుది జట్టులో ఉంటారు’’ అని కైఫ్ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని