Virat Kohli : విరాట్‌ vs ఆస్ట్రేలియా.. అదిరిపోయే రికార్డులు.. మరి ఈసారి ఏం చేస్తాడో..

ప్రపంచ టెస్టు మహా సమరం(WTC Final) బుధవారం నుంచే ప్రారంభం కానుంది. కొంత కాలంగా ఐసీసీ ట్రోఫీల కరవును ఎదుర్కొంటున్న టీమ్‌ఇండియా.. ఈసారి ఆ లోటును తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Published : 06 Jun 2023 19:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రపంచ క్రీడాభిమానులంతా ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మహా సమరానికి దిగ్గజ జట్లైన భారత్‌, ఆస్ట్రేలియా (India vs Australia) సిద్ధమయ్యాయి. ఇక ఈ టోర్నీలో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ పరుగుల వీరుడు చెలరేగి ఆడితే.. అడ్డుకోవడం ప్రత్యర్థి జట్టుకు కష్టమే. మరోవైపు ఆసీస్‌పై కోహ్లీ (Kohli vs Australia)కి మంచి రికార్డులే ఉన్నాయి.

ఆస్ట్రేలియాతో టెస్టులు అంటే.. విరాట్‌ అదరగొట్టేస్తాడు. ఇప్పటి వరకూ ఆసీస్‌పై 24 టెస్టులు ఆడిన కోహ్లీ.. 48.26 సగటుతో మొత్తం 1979 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో విరాట్‌.. ఆసీస్‌పై తన వ్యక్తిగత అత్యధిక స్కోరు(186) నమోదు చేశాడు. ఇదే ఫామ్‌ను ఇప్పుడు WTC Finalలో కొనసాగించాల్సి ఉంటుంది.

ఇక ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి.. కోహ్లీ మొత్తం 92 మ్యాచ్‌లు  ఆడగా.. 50.97 సగటుతో 4,954 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. 

ఓవల్‌లో మాత్రం..

ఫైనల్‌ జరిగే ఓవల్‌ (Oval)లో మాత్రం విరాట్‌ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ఈ వేదికగా మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 28.16 సగటుతో 169 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక అర్ధ శతకం ఉంది. ఆరు ఇన్నింగ్స్‌ల్లో .. రెండు సార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా.. ఒకసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే.. ఇటీవల తిరిగి ఫామ్‌ను అందుకున్న కోహ్లీ .. WTC Finalలాంటి ప్రతిష్ఠాత్మక టెస్టులో చెలరేగి ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

WTC Final ద్వారా విరాట్‌ ముందున్న రికార్డులివే..

  • ఆస్ట్రేలియా (Australia)పై టెస్టుల్లో 1,979 పరుగులు చేసిన విరాట్‌.. మరో 21 పరుగులు చేస్తే రెండు వేల పరుగుల మైలురాయి చేరుకుంటాడు. మరో 55 పరుగులు చేస్తే.. ఆసీస్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 5 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు.
  • ఐసీసీ టోర్నమెంట్స్‌ నాకౌట్‌ స్టేజ్‌ మ్యాచ్‌(అన్ని ఫార్మాట్లలో)ల్లో విరాట్‌ 620 పరుగులు చేశాడు. ఈ జాబితాలో అతడికంటే ముందు సచిన్‌ (657), రికీ పాంటింగ్‌ (731) మాత్రమే ఉన్నారు. ఈ ఫైనల్‌ ద్వారా ఈ జాబితాలో ముందుకు వెళ్లే అవకాశం కోహ్లీకుంది.
  • టెస్టుల్లో ఒకే బౌలర్‌పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు  పుజారా పేరిట ఉంది. నాథన్‌ లయన్‌ బౌలింగ్‌లో అతడు 570 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. నాథన్‌ బౌలింగ్‌లోనే కోహ్లీ 511 పరుగులు చేశాడు.
  • ఇక ఇంగ్లాండ్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రాహుల్‌ ద్రవిడ్‌ ముందున్నాడు. 46 మ్యాచ్‌ల్లో అతడు 2,645 పరుగులు చేశాడు. ఆ తర్వాత సచిన్‌(2,626 పరుగులు) ఉండగా.. మూడో స్థానంలో విరాట్‌(2,574) ఉన్నాడు. మరో 72 పరుగులు చేస్తే.. విరాట్‌ మొదటి స్థానంలోకి వస్తాడు.
  • ఇక ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో సచిన్‌(11 సెంచరీలు) ముందున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో గావస్కర్‌-విరాట్‌(8 సెంచరీలు) ఉన్నారు. మరో సెంచరీ చేస్తే.. కోహ్లీ ఈ జాబితాలో రెండో స్థానంలోకి వస్తాడు.
  • ఐసీసీ నిర్వహించే టోర్నీ ఫైనల్స్‌లో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్‌ బ్యాటర్‌ గంగూలీ. 2000 సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో దాదా శతకం నమోదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మరే ఇతర టీమ్‌ఇండియా ఆటగాడు ఐసీసీ ట్రోఫీ ఫైనళ్లలో సెంచరీ నమోదు చేయలేదు. ఇప్పుడు విరాట్‌ ఆ లోటును తీర్చుతాడేమో చూడాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని