సెహ్వాగ్‌పై విషం కక్కిన పాక్‌ బౌలర్‌ హసన్‌

భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఔట్‌ చేయడం చాలా సులభమని పాక్‌ బౌలర్‌ రాణా నవేద్‌ ఉల్‌ హసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. సెహ్వాగ్‌ను ఔట్‌ చేసిన సందర్భం గురించి వివరించాడు. 

Published : 18 Jul 2023 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీలుచిక్కినప్పుడల్లా పాకిస్థాన్‌ క్రికెటర్లు భారత ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి అక్కసు వెళ్లగక్కుతుంటారు. తాజాగా భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌పై పాక్‌ బౌలర్‌ రాణా నవేద్‌ ఉల్‌ హసన్‌ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఔట్‌ చేయడం చాలా సులభమని చెప్పాడు. దీనికి ఉదాహరణగా ఓ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ను ఔట్‌ చేసిన తీరు గురించి చెప్పాడు.  

భారత్‌, పాక్‌ మధ్య 2004-05లో జరిగిన సిరీస్‌ అది. అప్పటికే భారత్‌ 2-0తో ముందుంజలో ఉంది. మూడో మ్యాచ్‌లోనూ భారత్‌ 300కుపైగా పరుగులతో దూసుకెళ్తోంది. ఆ సమయంలో సెహ్వాగ్‌ 85 పరుగుల వద్ద ఉన్నాడు. వీరూ వికెట్‌ తీస్తేనే మ్యాచ్‌ గెలుస్తామని భావించిన పాక్‌ పేసర్‌ హసన్‌.. తన కుటిల బుద్ధిని బయటపెట్టాడు. సెహ్వాగ్‌కు స్లోగా బౌలింగ్‌ చేసి ‘నీకు ఎలా ఆడాలో తెలియదు..’ అంటూ రెచ్చగొట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన సెహ్వాగ్‌.. హసన్‌ వేసిన తదుపరి బంతిని భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఫాస్ట్‌ బౌలర్‌కు బ్యాటర్‌ను రెచ్చగొట్టి స్లో డెలవరీతో బోల్తా కొట్టించే ట్రిక్స్‌ ఉంటాయని చెప్పుకొచ్చాడు. భారత్‌ ఆటగాళ్లలో సెహ్వాగ్‌ను ఔట్‌ చేయొచ్చు.. గానీ, రాహుల్‌ ద్రవిడ్‌ను ఔట్‌ చేయడం అంత సులువు కాదని చెప్పాడు. 

ధోనీ ముందుకు వచ్చే సరికి.. నా నోరు మూతపడుతుంది: చాహల్‌

టెస్ట్‌ మ్యాచ్‌లను కూడా టీ20ల్లా ఆడి భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు టీమ్‌ ఇండియా ఓపెనర్‌.. వీరేంద్ర సెహ్వాగ్‌. తన కెరియర్‌లో మొత్తం 104 టెస్టులు ఆడి 8,586 పరుగులు సాధించాడు. టెస్టుల్లో రెండు ట్రిపుల్‌ సెంచరీలు చేసిన రికార్డు వీరూకి ఉంది. 251 వన్డేల్లో 8,273 పరుగులు, 19 టీ20ల్లో 394 పరుగులు చేశాడు. ఇక పాక్‌ బౌలర్‌ హసన్‌ విషయానికొస్తే.. 74 వన్డేల్లో 110 వికెట్లు తీశాడు. 9 టెస్టులు, 4 టీ20లు ఆడి మొత్తం 23 వికెట్లు పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని