పదేళ్ల మీ పాలన తీరు వల్లే గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌

Eenadu icon
By Telangana News Desk Published : 01 Aug 2025 03:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మంత్రి పొంగులేటి ధ్వజం

ఎనిమిదో తరగతి విద్యార్థినిని కూర్చోబెట్టుకొని సైకిల్‌ తొక్కుతున్న మంత్రి పొంగులేటి

కూసుమంచి, న్యూస్‌టుడే: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి వారిని మణిరత్నాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గ కేంద్రం కూసుమంచిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.5.50 కోట్లతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనానికి శంకుస్థాపన, అదనపు తరగతి గదులకు ప్రారంభోత్సవం చేశారు. తమ ట్రస్ట్‌ (పీఎస్‌ఆర్‌) ద్వారా మండలంలోని 8వ తరగతి విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ చేపట్టారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వ పెద్దలు గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్‌ జరిగిందని, ఇతరత్రా సమస్యలు ఏర్పడ్డాయని అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఈ దౌర్భాగ్యం, పదేళ్ల వారి పరిపాలన తీరువల్ల కాదా? వారి నిర్వాకంతో పాడైన వ్యవస్థను బాగు చేసే బాధ్యతను మా ప్రభుత్వం స్వీకరించింది. శిథిలావస్థకు చేరిన రైసు మిల్లుల్లో, కోళ్ల ఫారాల్లో విద్యాసంస్థలను నడిపినవారికి.. ఈ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు. ధనిక రాష్ట్రాన్ని రూ.8.19 లక్షల కోట్ల అప్పులపాల్జేసినవారు నిస్సిగ్గుగా విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల రూపంలో 3.5 నుంచి 4వేల మంది విద్యార్థులు కులమతాలకు అతీతంగా ఒకేచోట చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వసతిగృహ విద్యార్థుల డైట్‌ ఛార్జీలను 40శాతం, కాస్మెటిక్‌ ఛార్జీలను 200 శాతం పెంచాం’’ అని మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు