అర్హత సాధిస్తే ఖాళీ పోస్టుల్లో నియమించండి

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 03:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

స్టాఫ్‌ నర్సుల నియామకంలో హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: వెయిటేజీ మార్కులు కలిపిన తరువాత, పోస్టులు ఖాళీగా ఉంటే పిటిషనర్లతో భర్తీ చేయాలని వైద్యారోగ్య సర్వీసెస్‌ నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టాఫ్‌ నర్సుల పరీక్షలను ఓఎంఆర్‌ విధానంలో కాకుండా కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహించడాన్ని సవాలు చేస్తూ బి.నిర్మల మరో 10 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..రాతపరీక్షకు 80, సర్వీసుకు 20పాయింట్ల చొప్పున నార్మలైజేషన్‌ పద్ధతిన మార్కులు కేటాయించారన్నారు. ఓఎంఆర్‌ నుంచి కంప్యూటర్‌ విధానంలో మార్చడం, నార్మలైజేషన్‌ గురించి నోటిఫికేషన్‌లో పేర్కొనలేదన్నారు. 38వేల మందికి మూడు షిఫ్టుల్లో ఏ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించారో వెల్లడించలేదన్నారు. పరీక్ష నిర్వహించిన అరగంటలో మార్కుల జాబితా, తాత్కాలిక ఎంపికజాబితా ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వన్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నార్మలైజేషన్‌ గురించి మార్కుల జాబితా వెల్లడించక ముందే వెబ్‌నోట్‌ ద్వారా తెలిపామన్నారు. పరీక్షల్లో అర్హత సాధించలేదని కోర్టును ఆశ్రయించడం చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వెయిటేజీ మార్కులు కలిపిన తర్వాత పిటిషనర్లు అర్హత సాధించారో లేదో వాదనలతోపాటు కౌంటర్‌లో చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు.గతేడాది జనవరిలో 11 పోస్టులు ఖాళీగా ఉంచాలన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అమలు చేశారో కూడా చెప్పలేదన్నారు. పిటిషనర్లకు చెందిన మార్కులను వెయిటేజీతో సహా వెల్లడించాలని, వారు అర్హత సాధిస్తే సదరు 11 పోస్టుల్లో నియమించాలని ఆదేశిస్తూ విచారణను మూసివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని