రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 04:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కేంద్రమంత్రి బండి సంజయ్‌

‘ఐక్యత మార్చ్‌’ గోడపత్రికను ఆవిష్కరిస్తున్న సంజయ్, అధికారులు, పార్టీ ప్రతినిధులు

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లోని మేరా యువభారత్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ను కత్తితో చంపినా, గోరక్షకుడిపై కాల్పులు జరిపినా కాంగ్రెస్‌ సర్కారుకు పట్టింపేది? మేం బాధితులను పరామర్శిస్తే మజ్లిస్‌ నేతలు రౌడీషీటర్లను పరామర్శిస్తూ వారికి కొమ్ముకాస్తున్నారు. యూపీ ప్రభుత్వం తరహాలో ఇక్కడ కూడా రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలి. తెలంగాణ క్యాబినెట్‌లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి విచారణ జరిపించాలి. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 31 నుంచి నవంబరు 25 వరకు ‘సర్దార్‌ జీ150 ఐక్యతా మార్చ్‌’ పేరిట పాదయాత్రలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించాం. పార్టీలకతీతంగా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. సర్దార్‌   స్వగ్రామమైన కరంసద్‌ నుంచి స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ వరకు 152 కి.మీ. మేర నిర్వహించే పాదయాత్రలో ప్రధాని ఒక రోజు పాల్గొంటారు. కరీంనగర్‌లో నిర్వహించే పాదయాత్రలో నేను పాల్గొంటా’ అని సంజయ్‌ తెలిపారు. అనంతరం ‘ఐక్యత మార్చ్‌’ గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో మేరా యువభారత్‌ జిల్లా అధికారి ఎం.వెంకటరాంబాబు, డీవైఎస్‌వో శ్రీనివాస్‌ గౌడ్, ప్రోగ్రాం అధికారి బి.రవీందర్, మాజీ మేయర్‌ సునీల్‌రావు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల భాజపా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు