పిల్లలపై లైంగిక వేధింపులు అత్యంత హేయమైన చర్య

Eenadu icon
By Telangana News Desk Published : 30 Oct 2025 04:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నిందితుడి విడుదలకు ఆదేశాలు జారీచేయలేమన్న హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ బాలల గృహంలో పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో సైదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సూపర్‌వైజర్‌ మహమ్మద్‌ రహమాన్‌ సిద్దిఖీ విడుదలకు ఆదేశాలు జారీచేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. పిల్లలను లైంగిక వేధింపులకు గురిచేయడం అత్యంత హేయమైన చర్య అని.. ఇలాంటి కేసుల్లో అరెస్టయిన వ్యక్తి విడుదలకు ఆదేశించలేమంది. సైదాబాద్‌ పోలీసులు అక్రమంగా నిర్బంధించిన తన సోదరుడు మహమ్మద్‌ రహమాన్‌ సిద్దిఖీని విడుదల చేయాలంటూ అతని సోదరి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆధారాల్లేకుండా పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, అంతేకాకుండా కస్టడీలో హింసించారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్‌ ఊరిళ్ల వాదనలు వినిపిస్తూ వేధింపులకు గురైనవారి కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలాలు సేకరించామన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. సాక్షుల వాంగ్మూలాలతోపాటు నిందితుడి నేరాంగీకార వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత నిందితుడు అత్యంత హేయమైన చర్యకు పాల్పడినట్లు తెలుస్తోందని పేర్కొంది. అంతేకాకుండా నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్‌ కస్టడీకి ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. అందువల్ల హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ పరిధిలో నిందితుడిని హాజరుపరచాలని ఆదేశాలివ్వలేమని పేర్కొంది. కస్టడీలో చిత్రహింసలకు సంబంధించిన ఆరోపణలపై చట్టప్రకారం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు