ఏకకాలంలో 3 వేల బీట్లలో పులుల గణన

Eenadu icon
By Telangana News Desk Updated : 01 Nov 2025 04:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

18-50 ఏళ్ల వారికి వాలంటీర్లుగా అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 3 వేల అటవీ బీట్లలో ఏకకాలంలో పులుల గణన సర్వే (ఆల్‌ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌-2026) చేపట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది. పెద్దపులులు, పాములు, పక్షుల సంరక్షణకు కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) డాక్టర్‌ సి.సువర్ణ శుక్రవారం హైదరాబాద్‌ అరణ్యభవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పులుల గణనలో అటవీ సిబ్బందితోపాటు వాలంటీర్లు, విద్యార్థులు, వన్యప్రాణి ప్రేమికులు పాల్గొనాలని ఆహ్వానించారు. 7 రోజులపాటు సాగే కార్యక్రమంలో పెద్దపులులతోపాటు చిరుతలు ఇతర మాంసాహార, శాకాహార జంతువులు.. అడవుల ఆక్రమణ, వృక్షాల నరికివేత, అగ్ని ప్రమాదాలు.. ఇలా వివిధ అంశాలపై సర్వే జరుగుతుందని తెలిపారు.

వైల్డ్‌లైఫ్‌ పీసీసీఎఫ్‌ ఎలూసింగ్‌ మేరు, ఓఎస్డీ శంకరన్, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్‌ సునీల్‌ హేరామత్‌ పలు అంశాలను వివరించారు. పులుల గణనలో 18-50 ఏళ్ల వయసువారికి వాలంటీర్లుగా అవకాశం ఉంటుందని.. వివరాలన్నింటినీ ఎం-స్ట్రైప్స్‌ యాప్‌లో నమోదుచేయాలని అధికారులు తెలిపారు. సర్వే జరిగే తీరు, నమోదు చేయాల్సిన సమాచారాన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు వివరించారు. అటవీ ప్రాంతాల్లో సర్వేకు వెళ్లేవారికి బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరారు. అటవీశాఖలో 2 వేల మందికిపైగా ఉద్యోగులున్నట్లు సునీల్‌ హేరామత్‌ తెలిపారు. సర్వేకు సంబంధించి ఒక్కో ఫారెస్ట్‌ బీట్‌ 15-20 చ.కి.మీ. ఉంటుందని.. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారని అధికారులు వెల్లడించారు. నవంబరు 20-26 వరకు సర్వే నిర్వహించాలని అనుకున్నప్పటికీ వర్షాల నేపథ్యంలో వేరే తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.

Tags :
Published : 01 Nov 2025 04:11 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు