Uttam: కృష్ణాజలాలను ఏపీ అక్రమంగా తరలిస్తోంది.. కేంద్రం అడ్డుకోవాలి: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Telangana News Team Updated : 18 Feb 2025 20:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఏపీ ప్రభుత్వం కృష్ణాజలాలను అక్రమంగా తరలిస్తోందని, కేంద్రం అడ్డుకోవాలన్నారు. జయపురలో కేంద్ర జలశక్తిశాఖ ఆధ్వర్యంలో జరిగిన నీటిపారుదలశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్‌.. నీటి నిల్వ సదుపాయాలు, నీటి సరఫరా నిర్వహణపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కోరారు. 55 కిలోమీటర్ల పొడవునా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వాలని.. గంగా, యమునా పునరుద్ధరణ తరహాలో మూసీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రి అన్నారు. మూసీ వెంట ట్రంక్, సీవరేజ్ నెట్ వర్క్ కోసం రూ.4వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు గోదావరి జలాలను తరలించే పనులకు రూ.6వేల కోట్లు ఇవ్వాలని కోరారు. 

కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా కేంద్రం చొరవ తీసుకొని తెలంగాణకు న్యాయం చేయాలన్న ఉత్తమ్‌.. పాలమూరు - రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, సీతారామసాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పనులు కొనసాగుతోన్న సాగునీటి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో రుణాలు సమకూర్చాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో పూడికతీతకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని కోరారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి ఎన్డీఎస్ఏ విచారణ నివేదిక త్వరగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన కార్యాచరణ సూచించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Tags :
Published : 18 Feb 2025 19:58 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని