Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్రం కొర్రీలు

Eenadu icon
By Telangana News Desk Updated : 03 Aug 2025 06:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
చిత్రంలో రచయిత పైళ్ల నవీన్‌రెడ్డి, ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీరెడ్డి తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నదీ జలాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల పంచాయితీలో తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. బనకచర్లపై ఏపీ మంత్రి లోకేశ్‌ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో పొంగులేటి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నాకు పేరు రాకుండా నిబంధనల పేరుతో కేంద్రం కొర్రీలు పెడుతోంది. ఇళ్ల సర్వేకు సంబంధించి కేంద్రం యాప్‌ కన్నా రాష్ట్రం రూపొందించింది బాగున్నా ఒప్పుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ షరతులకు అనుగుణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు లక్షల ఇళ్ల సర్వే పూర్తయింది.

ఒక్కో ఇంటికి కేంద్రం గ్రామీణంలో రూ.72 వేలు, అర్బన్‌లో రూ.1.52 లక్షలు ఇస్తోంది. రాష్ట్రం రూ.5 లక్షలు ఇస్తోంది. కేంద్రం ఇచ్చే అరకొర సాయంపై ఆధారపడకుండానే ఇళ్లు నిర్మిస్తున్నాం. గతంలో జరిగిన భూ అక్రమాలను వెలికితీసేందుకు ఒక సంస్థతో వచ్చే వారంలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఒప్పందం చేసుకోబోతున్నాం. సాదాబైనామా క్రమబద్ధీకరణ దరఖాస్తులను హైకోర్టు తీర్పు రాగానే పరిష్కరిస్తాం’ అని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పీఏ, డిప్యూటీ తహసీల్దార్‌ డాక్టర్‌ పైళ్ల నవీన్‌రెడ్డి రచించిన తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు, సాహిత్యం (తెలుగు, ఆంగ్లం) ఐదో ఎడిషన్‌ను పొంగులేటి ఆవిష్కరించారు. మంత్రి ఓఎస్డీ, ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 9 ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు 

రాష్ట్రంలో 9 ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనాలను ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్‌.లోకేశ్‌కుమార్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్‌వ్యవస్థీకరణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘‘మొదటి విడతలో ఓఆర్‌ఆర్‌ పరిధిలో నాలుగు లేదా ఐదు కార్యాలయాలను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకేచోట ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఏర్పాటు చేయనున్నాం. హైదరాబాద్‌ జిల్లాలో 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకుగాను రెండుచోట్ల, రంగారెడ్డి జిల్లాలో 14కుగాను మూడుచోట్ల, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 12కుగాను మూడుచోట్ల, సంగారెడ్డి, పటాన్‌చెరులకు కలిపి ఒకచోట ఇంటిగ్రేటెడ్‌ భవనాలను నిర్మించనున్నాం. ఈ భవనాలు కార్పొరేట్‌ స్థాయిలో ఉంటాయి. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని భవన నిర్మాణాలకు అవసరమైన భూమిని గుర్తించాలి’ అని మంత్రి పేర్కొన్నారు. 

మూడు ఎకరాల భూమి కేటాయింపు

శేరిలింగంపల్లి, గండిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్మాణం కోసం మూడు ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సర్వే నంబర్‌ 91/2లో మూడు ఎకరాల భూమిని గుర్తించారు.

Tags :
Published : 03 Aug 2025 04:30 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు