Telangana High Court: బ్యాంకింగ్‌ వ్యవస్థలోనే లోపాలున్నాయి

Eenadu icon
By Telangana News Desk Updated : 21 Jun 2025 06:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఛార్జీల పేరుతో సామాన్యులపై భారం వేస్తున్నారు..
రూ.వేల కోట్లు ఎగవేసిన వారిని వదిలేస్తున్నారు
బ్యాంకు అధికారుల తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థలో లోపాలున్నాయని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. బ్యాంకు అధికారులు వేల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేస్తున్నారని, తీసుకున్న వారు ఎగవేస్తుంటే పట్టించుకోవడంలేదని, అదే సమయంలో సామాన్యులపై వివిధ ఛార్జీల పేరుతో భారం మోపుతున్నారని ఆక్షేపించింది. మంజూరుచేసిన అధికారులపైనే వసూలు చేయాల్సిన బాధ్యత పెడితే.. వ్యవస్థలో కొంతయినా మార్పు వస్తుందని పేర్కొంది. హైదరాబాద్‌ సనత్‌నగర్‌ ఎస్‌బీఐ బ్రాంచి అధికారులు ముందస్తు చెల్లింపుల పేరుతో, ఎలాంటి సమాచారం లేకుండా ఛార్జీలను మినహాయించుకోవడాన్ని సవాలుచేస్తూ ఉత్తమ్‌ ధాతు అండ్‌ ఇస్పాత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఆస్తులను హామీగా ఉంచి తీసుకున్న రుణాన్ని ముందుగానే చెల్లించినందుకుగాను రూ.1.16 కోట్లు కంపెనీ ఖాతా నుంచి బ్యాంకు మినహాయించుకుందన్నారు.

ఇది ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధమని, జరిమానాతోపాటు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి బ్యాంకింగ్‌ వ్యవస్థ లోపభూయిష్ఠంగా ఉందని పేర్కొంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సాధారణ, మధ్య తరగతి ప్రజలు రుణాలు తీసుకుంటే ఛార్జీల పేరుతో బ్యాంకులు భారం వేస్తున్నాయి. రుణం ముందు తీర్చేసినా, జాప్యం చేసినా జరిమానాల పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. తీసుకున్న గృహరుణం పూర్తయిన తర్వాత.. సంబంధిత డాక్యుమెంట్‌ తీసుకునేటప్పుడు కూడా ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. అదే సమయంలో రూ.వేల కోట్ల రుణం తీసుకుని ఎగవేసిన వారి నుంచి వసూలు చేయలేకపోతున్నాయి. మంజూరు చేసిన బ్యాంకు అధికారే వసూలు బాధ్యత కూడా తీసుకోవాలనే నిబంధన ఉంటే రుణాలు సక్రమంగా మంజూరవుతాయి’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో ఆర్‌బీఐతోపాటు బ్యాంకు అధికారుల వివరణను పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రతివాదులైన ఆర్‌బీఐతోపాటు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలకు నోటీసులు జారీ చేస్తూ..కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Tags :
Published : 21 Jun 2025 03:15 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు