అవుటర్ టోల్ టెండర్లపై విచారణ
‘హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
సీబీఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలి
రీజినల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ విస్తరించాలి
హుస్సేన్సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటకాభివృద్ధి
ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈనాడు - హైదరాబాద్
‘హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏపై బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ మొత్తానికి టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించారు. ‘అందులో ఎవరెవరి ప్రమేయముంది? ఏయే సంస్థలున్నాయి? బాధ్యులెవరు? అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను అందజేయాల్సిన బాధ్యతను హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగిస్తున్నాం. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మాయమైనట్లు గుర్తిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేయండి. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయికి చెందిన మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.
నష్టాన్ని తెచ్చే డీపీఆర్ ఎంపికా?
టెండర్లకు ముందు అవుటర్ రింగ్ రోడ్డుపై టోల్ ట్యాక్స్ వసూళ్లతో ఏడాదికి గరిష్ఠంగా రూ. 600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. ‘అలాంటప్పుడు 30 సంవత్సరాలకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్బీ కంపెనీకి ఎలా అప్పగించార’ని సీఎం ప్రశ్నించారు. టెండర్ విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ‘హెచ్ఎండీఏ రెండు సంస్థలతో డీపీఆర్ తయారు చేయించింది. ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డీపీఆర్ను ఎంచుకుంది. దీనిపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని చూపించి.. 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించింది. ఆ లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నగరాభివృద్ధికి విజన్ డాక్యుమెంట్
‘అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలి. క్రమంగా రీజినల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలి. అవుటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మించాలి. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరంతోపాటు కొత్తగా విస్తరిస్తున్న చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమివ్వాలి. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో నగరాభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలి.
వేగవంతంగా ల్యాండ్ పూలింగ్
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించాలి. ల్యాండ్ పూలింగును వేగవంతం చేయాలి. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్సిళ్లు ఉన్నాయి. వీటిలో 2,031 పార్సిళ్లు కోర్టు కేసుల్లో ఉన్నాయి. హెచ్ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి. డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలి. ఆ స్థలాలతో హెచ్ఎండీఏ ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టాలి. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టాలి. హెచ్ఎండీఏ ఆస్తులు ఆక్రమణకు గురవకుండా చూసేందుకు డీఐజీ స్థాయి ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలి.
ఆహ్లాదకర జోన్గా హుస్సేన్సాగర్
హైదరాబాద్ హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరమైన జోన్గా తీర్చిదిద్దాలి. అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్ రోడ్డు నుంచి ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని ప్రపంచస్థాయి టూరిజం స్పాట్గా తయారు చేయాలి. హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించాలి. పర్యాటకులు, నగర ప్రజలు ఆనందంగా గడిపేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దండి. దుబాయ్ మోడల్లో స్కై వాక్ వే, ఫుడ్ స్టాళ్లు, పిల్లల ఎమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ ల్యాండ్ స్కేపులను అభివృద్ధి చేయాలి. అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను మరో మార్గానికి మళ్లించాలి. అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీలతో ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయించాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు.
ఆ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర నగరాల్లోని లే అవుట్లలో సామాజిక అవసరాలకు ఇచ్చిన స్థలాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయా? ఆక్రమణకు గురయ్యాయా? సర్వే చేయాలి. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. కార్పొరేట్ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వాటిని అప్పగించాలి. ఆ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు కనీసం 25 శాతం కోటా ఏర్పాటు చేసి ఉచితంగా ప్రవేశాలు కల్పించాలి. ఇలా అన్ని ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి తేవాలి.
సీఎం రేవంత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్