కినుక వహించిన చినుకు

చినుకు కినుక వహించింది. కురవనంటూ చిన్నబుచ్చుకుంది. వర్షానికి వర్షానికి మధ్య విరామం భారీగా ఉండటంతో రాష్ట్రంలో తాగు, సాగు నీటికి కటకట పరిస్థితులు ఏర్పడ్డాయి.

Published : 12 Apr 2024 05:41 IST

305 రోజుల్లో వాన కురిసింది 66 రోజులే
వానాకాలంలో 612  మండలాల్లో 476 డ్రైస్పెల్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: చినుకు కినుక వహించింది. కురవనంటూ చిన్నబుచ్చుకుంది. వర్షానికి వర్షానికి మధ్య విరామం భారీగా ఉండటంతో రాష్ట్రంలో తాగు, సాగు నీటికి కటకట పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు పంటలకు, నేలకు తేమను ఇచ్చే వర్షాలు అతి తక్కువగా పడటంతో భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య 305 రోజులకుగాను కేవలం 66 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. తక్కువ వర్షాలు, వాటి మధ్య భారీ అంతరంతో రాష్ట్రంలో క్షామ పరిస్థితులు తలెత్తాయని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంస్థ తాజా గణాంకాలు  వెల్లడిస్తున్నాయి.

తీవ్ర ప్రభావం చూపిన డ్రైస్పెల్స్‌

వర్షానికి వర్షానికి మధ్య (కనీసం నాలుగు వారాలు) విరామం రావడాన్ని డ్రైస్పెల్‌గా అంచనా వేస్తారు. తేలికపాటి నేలల్లో మూడు వారాలను పరిగణిస్తారు. ఈ విరామం మధ్య 50 శాతం కన్నా తక్కువ వర్షపాతం లేదా వర్షం పూర్తిగా కురవకపోవడాన్ని ఒక స్పెల్‌గా పరిగణిస్తారు.

  • డ్రైస్పెల్‌ భూగర్భ జలమట్టంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. వాన నీరు నేలలోకి ఇంకాలంటే విరామం లేకుండా వర్షాలు కురవాల్సి ఉంటుంది.
  • ప్రధానంగా నైరుతి రుతుపవన కాలంలో రాష్ట్రంలోని 612 మండలాల్లో మొత్తం 476 డ్రైస్పెల్స్‌ నమోదయ్యాయి. ఎక్కువగా సూర్యాపేటలో 37, రంగారెడ్డి 34, సంగారెడ్డి 28, ఖమ్మం 26, నల్గొండ 24, మహబూబాబాద్‌ 22, హైదరాబాద్‌ 20, నాగర్‌కర్నూల్‌ 18, మేడ్చల్‌ మల్కాజిగిరి 17, భద్రాద్రి 16, మంచిర్యాల 16, యాదాద్రిలో 16 డ్రైస్పెల్స్‌ నమోదయ్యాయి.
  • తేలికపాటి నేలల్లో మూడు వారాలను ఒక డ్రైస్పెల్‌గా పరిగణిస్తారు. ఇవి 336 నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 33, సూర్యాపేట 33, నల్గొండ 24, ఖమ్మం 24, ఆదిలాబాద్‌ 10, మంచిర్యాల 16, నిజామాబాద్‌ 12, భద్రాద్రి కొత్తగూడెం 14, మహబూబాబాద్‌ 18, కామారెడ్డి 13, సంగారెడ్డి 14, యాదాద్రిలో 15 డ్రైస్పెల్స్‌ నమోదయ్యాయి.
  •  కఠిన నేలల్లో డ్రైస్పెల్‌ వ్యవధిని నాలుగు వారాలుగా పరిగణిస్తారు. ఇలాంటివి 140 నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్‌ మల్కాజిగిరి 13, హైదరాబాద్‌ 12, నాగర్‌కర్నూల్‌ 10, వికారాబాద్‌ 9, మహబూబ్‌నగర్‌లో 7 స్పెల్స్‌ నమోదయ్యాయి.
  • అధిక డ్రైస్పెల్స్‌ కారణంగా వర్షానికి వర్షానికి మధ్య అంతరం పెరిగి వాగుల్లో నిరంతర ప్రవాహం తగ్గిపోయి, భూగర్భ మట్టాలతో పాటు ప్రాజెక్టుల్లో సైతం నీటి నిల్వలు అడుగంటి నీటికి కటకటలాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని